రాజకీయాల్లో ఒకరి ఆలోచనలు ఇంకొకరికి నచ్చితే ఫాలో అవుతారు. ఒకరు ఆచరించిన మార్గం ఇంకొకరికి నచ్చినా వెంట నడుస్తారు. నిన్నమొన్న ఒక విషయంలో రేవంత్ బాటలోనే తెలంగాణ సిఎం కేసిఆర్ తనయుడు, ఐటి మంత్రి కేటిఆర్ నడుస్తున్న విషయం వెల్లడైంది. తెలంగాణలో టిడిపి ఓటు బ్యాంకు రాబట్టేందుకు రేవంత్ బాటలో కేటిఆర్ నడుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా రేవంత్ బాటలో మామ కూడా నడుస్తున్నారు. ఎవరా మామ? ఎవరికి మామ అనుకుంటున్నారా? అయితే చదవాల్సిందే.
రేవంత్ రెడ్డికి మామ వరుస అయిన కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి రేవంత్ బాటలోనే నడిచారు. రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా ఇస్తున్న ప్రకటన ఇవాళ సూదిని జైపాల్ రెడ్డి నోటినుంచి వచ్చింది. తెలంగాణలో టిఆర్ ఎస్ వ్యతిరేకుల పునరేకీకరణ జరగాలని జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ డైలాగ్ ను ఎప్పటినుంచో రేవంత్ పదే పదే వాడుతున్నారు. కేసిఆర్ అనుకూల పునరేకీకరణ జరుగుతోందని.. ఇక జరగాల్సింది కేసిఆర్ వ్యతిరేకుల పునరేకీకరణే అని రేవంత్ డైలాగ్ విసిరారు. సరిగ్గా జైపాల్ కూడా అదే డైలాగ్ వాడడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. జైపాల్ రెడ్డి ఏమన్నారో కింద చదవండి.
తెలంగాణ ప్రత్యేక సాధన కోసం పోరాటాలు చేసి, తెలంగాణ సాధనలో నిరంతరం శ్రమించి ఉద్యమాలు చేసిన వ్యక్తులకు, శక్తులకు వ్యతిరేకంగా ప్రస్తుతం టిఆర్ ఎస్ పాలన సాగుతుందని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన నాలుగేళ్ళ తరువాత కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని జైపాల్ రెడ్డి విమర్శించారు.
సోమవారం నాడు ఆయన ఒక ప్రకటన చేస్తూ ప్రస్తుతం టిఆర్ ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఐక్యం కావాల్సిన అవసరముందని అందులో భాగంగా 20వ తేదీన జడ్చర్ల జన ఘర్జన పేరుతో చేపడుతన్న బహిరంగ సభ టిఆర్ ఎస్ వ్యతిరేక శక్తుల ఐక్యతకు నాంది పలుకుతుందని ఆయన అన్నారు. జడ్చర్ల జన ఘర్జన సభను విజయవంతం చేసేందుకు టిఆర్ ఎస్ వ్యతిరేక శక్తులు ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృత్తి దారులు ప్రతి ఒక్క వర్గం కష్ట నష్టాల పాలు అవుతుందని, వారికి ముఖ్యమంత్రి కేసిఆర్ హామీలు ఇచ్చి మభ్య పెడుతూ రాజకీయ భ్రమలు కల్పించి కాలం వెల్ల దీస్తున్నారని, 4 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, నిరుద్యోగులు ప్రాణాలు వదులుతున్నా, అవినీతి పెచ్చి పెరిగిపోయినా కూడా కేసిఆర్ ఎలాంటి నివారణ చర్యలు తీసుకోకపోగా వాటిని వంత పాడే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ వారిని కుల వృత్తులకు పరిమితం చేసి పాలనాధికారాలను తన చేతిలో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అవినీతి రాజ్యమేలుతుందని ముఖ్యమంత్రే స్వయంగా రాజకీయ ఫిరాయంపులను విచ్చలవిడిగా ప్రోత్సహించి ఒక అనైతిక పాలన చేస్తున్నారని, రాష్ట్రంలో అప్పులు చేయడం తప్ప అభివృద్ది లేకుండా పోయిందని, ఆయన అన్నారు. ఉద్యమాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను కేసిఆర్ నిరంకుశ, అవినీతి, అశ్రిత పక్షపాతం నుంచి కూడా కాపాడుకోవడానికి మరోసారి కేసిఆర్ వ్యతిరేక శక్తులంతా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన పిలుపునిచ్చారు.