
హైదరాబాద్: తెలంగాణ జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో వరి కోస్తుండగా ఓ హార్వెస్టర్ ఆగిపోయింది. సరిగ్గా దానిపైనే 33 కేవీ విద్యుత్ వైర్లు ఉన్నాయి. ఇవేవీ చూడకుండా ఓ యువకుడు హార్వెస్టర్ ఎక్కి రిపేర్ చేయడం ప్రారంభించాడు. అనుకోకుండా ఆ వైర్లు తగలడంతో ఆ యువకుడు షాక్కు గురై మరణించాడు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నూకపల్లి శివారులోని పంట పొలంలో హార్వెస్టర్ వరి కోస్తున్నది. ఆ హార్వెస్టర్ ఉన్నట్టుండి విద్యుత్ వైర్లు ఉన్న చోటకు వచ్చి ఆగిపోయింది. దీంతో చెల్లిమల్ల రాజ్కుమార్ అనే యువకుడు పైన విద్యుత్ వైర్లు ఉన్నాయన్న విషయాన్ని పట్టించుకోకుండా పైకి ఎక్కి మరమ్మతు చేయబోయాడు. కానీ, ఆ వైర్లు తగలడంతో విషాదం చోటుచేసుకుంది. ఆ యువకుడు విద్యుత్ షాక్కు గురై దుర్మరణం చెందాడు.
ఇదిలా ఉండగా, ములుగు జిల్లాలో నిన్న ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంతో 40 ఇళ్లు దగ్ధం అయ్యాయి. మంగపేట మండలం శనిగకుంట వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. గాలి బీభత్సం కారణంగా చెలరేగిన మంటలు.. దావానంలా ఊరంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 40 ఇళ్లు దగ్ధం కావడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గాలి బీభత్సం కారణంగా చెలరేగిన మంటలు.. దావానంలా ఊరంతా వ్యాపించాయి. దాంతో ఆదివాసీలు ప్రాణభయంతో పిల్లలను పట్టుకుని పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో 40 గిరిజన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, వారు కోరుతున్నారు. అగ్ని ప్రమాదంతో అలర్ట్ అయిన విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాంతో ఆ ప్రాంతం అంతా అంధకారంగా మారింది. సహాయచర్యలు కొనసాగుతోన్నాయి.
అగ్ని ప్రమాదం జరిగి 40 గుడిసెలు దగ్ధం కావడం పట్ల మంత్రి సత్యవతి రాఠోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి వెంటనే అవసరమైన సాయం అందించాలని, పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.