
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇంటర్ పోల్ రెడ్ నోటీసు డేటాబేస్ నుంచి వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని తొలగించడంపై స్పందించిన కేటీఆర్.. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు. గుజరాత్లోని మోసగాళ్లందరికీ ప్రత్యేక మినహాయింపు ఉందా? అని ప్రశ్నించారు. ‘‘మెహుల్ చోక్సీ భాయ్’’ రాజా సత్య హరిశ్చంద్ర మరొక కజిన్ అంటూ విమర్శించారు. మెహుల్ చోక్సీ భాయ్ కేవలం రూ. 13,500 కోట్ల చిన్న బ్యాంకు మోసానికి పాల్పడ్డాడని సెటైర్లు వేశారు. అతడికి స్కాట్-ఫ్రీగా (ఎటువంటి శిక్ష లేకుండా) ప్రయాణించడానికి అనుమతిస్తూ ఎన్వోసీ కూడా ఇచ్చారని ఎద్దేవా చేశారు. #ModiHaiTohMumkinHai (మోదీ ఉంటేనే అది సాధ్యం), #AMitrKaal అనే హ్యాష్ ట్యాగ్లు కూడా తన ట్వీట్కు జతచేశారు.
ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బీ)కి రూ. 11,356.84 కోట్ల రుణాన్ని మోసం చేసిన కేసులో నిందితుడైన మెహుల్ చోక్సీని ఇంటర్పోల్ తన రెడ్ నోటీసు జాబితా నుండి తొలగించింది. చోక్సీని డిసెంబర్ 2018లో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జాబితాలో చేర్చింది. తనపై రెడ్ కార్నర్ నోటీసును సవాలు చేస్తూ ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయంలో చోక్సీ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని ఎత్తివేస్తూ ఇంటర్పోల్ నిర్ణయం తీసుకుంది.
మెహుల్ చోక్సీని రెడ్ కార్నర్ జాబితా నుంచి తొలగించడంపై భారత ప్రభుత్వ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో చోక్సీ బహిష్కరణ కోసం ఎదురుచూస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెహుల్ చోక్సీపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసును రద్దు చేయడం వల్ల కేసుపై ఎలాంటి ప్రభావం ఉండదని.. ఇది ఇప్పటికే చివరి దశలో ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్టు చేసింది. మరోవైపు ఈ పరిణామాలపై కేంద్రంలోని బీజేపీపై విపక్ష పార్టీలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.