పబ్జీ ఆడొద్దన్నందుకు.. మేడపై నుంచి కిందకు దూకి..

By telugu news teamFirst Published Jan 25, 2021, 10:10 AM IST
Highlights

ఐదు అంతస్థుల మేడ పై నుంచి కిందకు దూకి బలవన్మరణానికి ప్రయత్నించాడు. అయితే.. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు.

పబ్జీ ఆడొద్దని తండ్రి చెప్పాడనే కోపంతో ఓ విద్యార్థి..  ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నాడు. ఐదు అంతస్థుల మేడ పై నుంచి కిందకు దూకి బలవన్మరణానికి ప్రయత్నించాడు. అయితే.. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన పంజాగుట్ట సమీపంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

పంజగుట్ట ప్రతాప్‌నగర్‌లో కొన్నేళ్లుగా ఓ కుటుంబం నివాసముంటోంది. ఆన్‌లైన్‌ క్లాసులున్న నేపథ్యంలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న బాలుడు (17) కొన్ని రోజులుగా పబ్‌జీ ఆటకు బానిసయ్యాడు. అది గమనించిన ఆ బాలుడి తండ్రి శనివారం రాత్రి అతడిని మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు పక్కనే ఉన్న ఐదంతస్తుల ఇంటిపైకి ఎక్కి కిందికి దూకేశాడు.

ఈ క్రమంలో నేరుగా కరెంటు వైర్లు, కేబుల్‌ వైర్లపై పడి కిందకు జారాడు. అదృష్టవశాత్తు బాలుడికి స్వల్ప గాయాలే కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇటు వైర్లపై ఒకేసారి భారం పడటంతో కరెంటు స్తంభం కూడా కూలింది. బాలుడిని సమీపంలోని తన్వీర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇటు కరెంటు స్తంభం కూలడంతో శనివారం రాత్రి 8.30 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. సమాచారమందుకున్న విద్యుత్‌ శాఖ సిబ్బంది కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి వైర్ల కనెక్షన్లను పునరుద్ధరించారు. 

click me!