
Telangana: బయో ఆసియా-2022 సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ అధ్యక్షుడు బిల్ గేట్స్ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆన్లైన్లో సంభాషించారు. ఈ క్రమంలోనే కరోనా నేపథ్యంలో వ్యాక్సిన్ల తయారీ, రవాణాలో భారత్ ప్రశంసనీయ పాత్ర పోషించిందనీ, వ్యాక్సిన్ కోసం భారత్లోని ఫార్మా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా విశేషంగా కృషి చేశాయని బిల్ గేట్స్ కొనియాడారు. అలాగే, కోవిడ్-19 వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీ మరియు పంపిణీపై భారతదేశం చేసిన కృషి భారీ సంఖ్యలో ప్రాణాలను రక్షించడంలో సహాయపడిందన్నారు. తెలంగాణ సర్కారు బయోఆసియా-2022 సదస్సును వర్చువల్గా నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ప్రపంచంలోని చాలా మంది ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పాలుపంచుకుంటున్నారు.
బయో ఆసియా-2022 సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ అధ్యక్షుడు బిల్ గేట్స్ తెలంగాణ మంత్రి కేటీఆర్తో ఈ వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం గొప్ప కృషిలో భాగంగా కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొవడానికి వ్యాక్సిన్లు అభివృద్ధి అంశాన్ని పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలు కరోనా ప్రభావాన్ని ముందుగానే గుర్తించి.. అంచనాకు వచ్చాయని పేర్కొన్న బిల్ గేట్స్.. భారతదేశం వ్యాక్సిన్ కవరేజ్ చాలా సంపన్న దేశాల కంటే మెరుగ్గా ఉందనీ, ఇది చాలా అసాధారణమైనదని అన్నారు. అయితే, “మేము ప్రతిస్పందించిన వేగం ఆదర్శంగా ఉండేంత వేగంగా లేదు. వ్యాధి నిర్ధారణ సామర్థ్యం మరియు ఇన్ఫెక్షన్ స్థాయి చాలా తక్కువగా ఉన్నప్పుడు ప్రజలను నిర్బంధించే సామర్థ్యాన్ని పొందడం, ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాలు మాత్రమే ఆ పని చేశాయి. మరోవైపు, "వ్యాక్సిన్ల అభివృద్ధి వంటి అద్భుత విషయాలు జరిగాయి, ఇది నిజంగా నమ్మశక్యం కానిది" అని అన్నారు.
భారతదేశంలోని దాని భాగస్వాములతో ఫౌండేషన్ దేశంలో కొత్త సామర్థ్యాన్ని సృష్టించడానికి మరియు భవిష్యత్తులో వచ్చే మహమ్మారి కోసం అలాగే క్లిష్ట వ్యాధులకు వ్యాక్సిన్లను పొందేందుకు, mRNAతో సహా కొన్ని కొత్త వ్యాక్సిన్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించడానికి పరిశోధనా ఎజెండాను అనుసరిస్తోందని తెలిపారు. అలాగే, డయాగ్నోస్టిక్స్ మరియు థెరప్యూటిక్స్ ఫ్రంట్పై ప్రయత్నాలను మెరుగుపరచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రపంచం పరిశోధన, అభివృద్ధిపై ఎక్కువ ఖర్చు పెట్టాలని అన్నారు. ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు కృత్రిమ మేధ చాలా ఉపయోగపడబోతోందని పేర్కొన్న ఆయన.. ఇప్పటికే సెన్సార్ల సాయంతో స్మార్ట్వాచ్లు వాడకం పెరిగిన అంశాన్ని గుర్తు చేశారు. వైద్య సంబంధిత టెక్నాలజీ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు వస్తాయని వెల్లడించారు. హెచ్ఐవీని పూర్తిగా నిర్మూలించడానికి వ్యాక్సీన్ను తయారుచేయడం నా ప్రాధాన్యతల్లో మొదటి స్థానంతో ఉందని బిల్గేట్స్ పేర్కొన్నారు.
అందుబాటు ధరలో వైద్యం అందించడంపై దృష్టి సారించాలని బిల్ గేట్స్ అన్నారు. ఆయనను తెలంగాణను సందర్శించాల్సిందిగా కేటీఆర్ ఆహ్వానిస్తూ, “మీరు చాలా భిన్నమైన హైదరాబాద్ని చూస్తారు” అని అన్నారు. ప్రస్తుతం ప్రయాణాలు చేయడం లేదనీ, దాని కోసం ఎదురుచూస్తున్నానని గేట్స్ తెలిపారు.