ఉగ్రవాద దాడులపై ఐబీ వార్నింగ్: భద్రతను కట్టుదిట్టం చేసిన తెలంగాణ పోలీసులు

By narsimha lodeFirst Published Aug 10, 2022, 10:17 AM IST
Highlights

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికలు జారీ చేయడంతో తెలంగాణ పోలీసులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.   

హైదరాబాద్:స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికలు జారీ చేయడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఢిల్లీతో పాటు దేశంలో పలు నగరాలకు ఐబీ అలర్ట్ జారీ చేసింది. దీంతో ఢిల్లీలో భారీ పోలీస్ బందోబస్తును భద్రతా దళాలు ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో  తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. హైద్రాబాద్ లో పలు కీలక ప్రాంతాల్లో బందోబస్తును పెంచారు.

నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బందోబస్తును మరింత పెంచారు. నగరంలోని పర్యాటక ప్రాంతాలు, వీఐపీలు ఉండే ప్రాంతాలతో పాటు  రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ వార్నింగ్ ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు రద్దీ ఎక్కువగాఉండే ప్రాంతాల్లో పోలీసులు నిఘాను పెంచారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 

దేశంలో ఉగ్రదాడులకు సంబంధించి ఏదైనా ఘటనలు చోటు చేసుకొంటే హైద్రాబాద్ తో లింకులున్న ఘటనలు గతంలో చోటు చేసుకొన్నాయి. నగరంలో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారిపై కూడా నిఘాను పెంచారు పోలీసులు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే వేడుకల సమయాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. దీంతో ఢిల్లీలోని ఎర్రకోట సహా కీలక ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎర్రకోట పరిసర ప్రాంతాలను నో ప్లై జోన్ గా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో డ్రోన్ ల వినియోగంపై కూడా పోలీసులు నిషేధం విధించారు.  సుమారు వెయ్యి మందికిపైగా పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో మఫ్టీల్లో పోలీసులతో నిఘాను ఏర్పాటు చేశారు. 
 

click me!