
కార్లు అంటే పిచ్చి ఉన్నవారు చాలా మందే ఉండి ఉంటారు. మార్కెట్లోకి కొత్త కారు అడుగుపెట్టగానే...దానిని కొనాలి అనే ఆత్రుత చాలా మందికి ఉంటుంది. ఈ యువకుడు కూడా అంతే. అతనికి కార్లంటే అమితమైన ప్రేమ. కొత్త మోడల్ కారు వస్తుంది అంటే చాలు మరింత ఆసక్తి చూపిస్తాడు. తాజాగా... అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు.
హైదరాబాద్ నగరానికి చెందిన నసీర్ ఖాన్ కి కార్లు అంటే చాలా ఇష్టం. తాజాగా.. అతను రూ.12కోట్ల విలువచేసే కారును కొనుగోలు చేశాడు. ఇంటర్నేషనల్ బ్రాండ్ మెక్ లారెన్ 765 ఎల్ టీ కారును అతను కొనుగోలు చేశాడు. మెక్ లారెన్ కంపెనీ కొద్ది నెలల క్రితం భారత్ లో తొలి షోరూమ్ ని ప్రారంభించింది. ముంబయి నగరంలో దీనిని ప్రారంభించారు.
రెండు రోజుల క్రితమే ఈ కారు ముంబయికి వచ్చింది. దీంతో ఈ యువకుడు ఆ కారును కొనుగోలు చేశాడు. ఆ కారుతో ఫోటోలు, వీడియోలు తీసి.. తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది.. ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. మెక్ లారెన్ కంపెనీ దేశంలో విక్రయించిన రెండు కారులలో ఒకటి కోల్ కతాలోని ఓ వ్యాపారి కొనుగోలు చేయగా.. రెండో కారును హైదరాబాద్ కి చెందిన నసీర్ ఖాన్ కొనుగోలు చేయడం విశేషం.