
హైదరాబాద్ : అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో శరవేగంగా అభివృద్ది చెందుతున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) లో రోజురోజుకు ట్రాఫిక్ మరింతగా పెరిగిపోతోంది. దీంతో నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడంలేదు. ఇలా భారీ ట్రాఫిక్ తో సతమతమవుతున్న నగరవాసులకు కాస్త ఊరటనిచ్చేందుకు కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే జంట నగరాలయిన హైదరాబాద్, సికింద్రాబాద్ ట్రాఫిక్ విషయంలో భారీ మార్పులకు రంగం సిద్ధమయ్యింది.
ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ (hyderabad traffic) పోలీసులు శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలతో పాటు ఆర్టీఏ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే విషయమై ఈ సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలోనే శివారు ప్రాంతాలనుండి నగరంలోకి వస్తున్న ఆటోలను నియంత్రించాలని నిర్ణయించారు.
జంటనగరాల్లో కేవలం రిజిస్టర్ అయిన ఓలా ఆటోలకు మాత్రమే అనుమతివ్వాలని నిర్ణయించారు. అందులోనూ కేవలం ఆర్టిఏ రిజిస్ట్రేషన్ సీరీస్ 9 నుంచి 13 వరకు గల ఓలా ఆటోలకు మాత్రమే హైదరాబాద్ తిరిగేందుకు అనుమతివ్వనున్నారు. ఇందుకోసం వచ్చే నెల(మార్చి) ఒకటో తేదీ నుంచి ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.
ఇక నగరంలో జరుగుతున్న ప్రమాదాల నియంత్రణ కోసం మరో నిర్ణయం తీసుకున్నారు ట్రాఫిక్ పోలీసులు. జంటనగరాల్లో స్పీడ్ లిమిట్ ని ఫిక్స్ చేసేందుకు సిద్దమయ్యారు. ప్రదాన రహదారులపై టూ వీలర్స్. కార్లు, ఆటోలు ఎంత స్పీడ్ లో వెళ్లాలనేది త్వరలోనే నిర్ణయించి ప్రకటించనున్నట్లు ట్రాఫిక్ విబాగానికి చెందిన ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదిలావుంటే ఇటీవలే వాహనదారులపై కాస్త ఆర్థికభారాన్ని తగ్గించే నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం. ట్రాఫిక్ ఉళ్లంఘనలకు సంబంధించి వాహనాలపై జరిమానాలు పెండింగ్ లో వున్న వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటివరకు ట్రాఫిక్ చలాన్లు పూర్తిగా చెల్లించని వారికి జారిమానాల్లో రాయితీలు ఇస్తున్నట్టు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
ట్రాఫిక్ చలాన్ల విషయం గురించి హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవల ఈ కీలక ప్రకటన చేసారు. కరోనా వైరస్ మహమ్మారి చాలా మందిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని తెలిపారు. అయితే, ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించిన వాహనదారులకు విధించిన జరిమానాలలో తగ్గింపును అందించడం ద్వారా వారిపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతున్నదని రంగనాథ్ తెలిపారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ట్రాఫిక్ ఉల్లంఘటనలు అధికంగానే ఉన్నాయని... ఇప్పటివరకు చెల్లించని చలాన్లు రూ. 600 కోట్లు ఉన్నాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు. ఇప్పటివరకు చలాన్లు చెల్లించని వారికి కొంత ఊరట కల్పించేందుకే ఆ నిర్ణయం చేస్తున్నామని ఆయన అన్నారు.
ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతోనే ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నామని ఏవీ రంగనాథ్ తెలిపారు. అలాగే, ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్ పై పూర్తి విధానాలు ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్న ఆయన దీనిపై కసరత్తు కొనసాగుతున్నదని తెలిపారు. గత నాలుగైదు సంవత్సరాల్లో ప్రమాద డేటాను విశ్లేషించే అధ్యయనం ప్రస్తుతం జరుగుతుందని వెల్లడించారు. ఈ విశ్లేషణ అధ్యయనం ఆధారంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలు, అతివేగం, మద్య సేవించి వాహనాలు నడపడం వంటి వాటిని తగ్గించే ప్రయత్నం చేస్తారని తెలిపారు.