
ప్రపంచంలోని పలు దిగ్గజ కంపెనీలకు పలువురు భారతీయులు సారథ్యం వహిస్తున్నారు. తాజాగా.. మరో భారతీయుడు కీలక పదవిని కైవసం చేసుకున్నారు. వరల్డ్ బ్యాంకు(World bank) అధ్యక్ష పదవికి భారతీయ అమెరికన్ అజయ్ బంగా (63) ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అయితే..ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకున్న అజయ్ బంగాకు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధముంది. ఆయన స్కూలింగ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జరగడం మరో విశేషం.
అజయ్ బంగా బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1976 బ్యాచ్కి చెందినవారు. అతని పాఠశాల విద్య ఈ పాఠశాలలోనే జరిగింది. వాస్తవానికి అజయ్ బంగా స్వస్థలం పుణె . ఆయన తండ్రి హర్భజన్ సింగ్ బంగా భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేసేవారు. ఆయనకు హైదరాబాద్ కు బదిలీ కావడంతో పాఠశాల విద్య బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో(హెచ్పీఎస్) సాగింది. 11వ తరగతి వరకు బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారని ఆ పాఠశాల ప్రతినిధులు చెప్పారు. బంగా తన పాఠశాల విద్య పూర్తయిన తరువాత.. దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో అర్థ శాస్త్రంలో గ్రాడ్యూవేషన్ చేశారు. అనంతరం అహ్మదాబాద్ ఐఐఎంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
1981లో నెస్లేతో ఆయన తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అజయ్ బంగా మాస్టర్ కార్డ్ సీఈవోగానూ పనిచేశారు. అలా మూడు దశాబ్దాల పాటు పలు అంతర్జాతీయ కంపెనీలకు సేవలందించారు. ఇలా అంచెలంచెలుగా ఎదిగాడు. ఇలా ఆయన ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు అధ్యక్ష స్థానానికి నామినేట్ అయ్యారు.
అలాగే.. 2016లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.
ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అజయ్ బంగాను నామినేట్ కావడంతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ అధ్యక్షులు గుస్తి నోరియా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు లభించిన అరుదైన ఘనత ఇది. హెచ్పీఎస్ లో చదివిన ఎందరో విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలలో ఉన్నత స్థానాలకు అధిష్టించారు. అజయ్ బంగాకు దక్కిన ఈ గౌరవంపై మేం ఎంతో గర్వ పడుతున్నాం. హెచ్పీఎస్ స్థాపించి.. వందేళ్లు పూర్తయిన సందర్భంలోనే స్కూల్ పూర్వ విద్యార్థి ప్రపంచ బ్యాంకుకు సారథి కావడం గర్వంగా ఉందని తెలిపారు.
హెచ్పీఎస్లో చదివిన ప్రముఖులు..
ఫెయిర్ఫ్యాక్స్ ఫైనాన్షియల్ ceo ప్రెమ్ వత్సా, దౌత్యవేత్త సయ్యద్ అక్బరుద్దీన్, బీర్ బ్యారెన్ కరన్ బిలిమోరీయ, WIPRO మాజీ CEO టి.కె. కురియన్, ఏపీ C,M. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రపంచ సుందరి డయానా హేడెన్, క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే, నటుడు రామ్ చరణ్, అక్కినేని నాగార్జున, వివేక్ ఒబెరాయ్, రానా దగ్గుబాటి కూడా హెచ్పీఎస్ పూర్వ విద్యార్థులే!