సోషల్ మీడియాలో వ్యాఖ్యలు, రాజాసింగ్‌కి పోలీసుల నోటీసులు.. వివరణకు రెండు రోజుల డెడ్‌లైన్

By Siva KodatiFirst Published Dec 6, 2022, 8:43 PM IST
Highlights

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి మంగళవారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారని, హైకోర్టు షరతులను ఉల్లంఘించారంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. 

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఇటీవల చేసిన కామెంట్స్‌పై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసుల్లో కోరారు. ప్రత్యేకంగా ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా కామెంట్స్ వున్నాయని పోలీసులు ప్రస్తావించారు. హైకోర్ట్ పెట్టిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని పోలీసులు పేర్కొన్నారు. రెండు రోజుల్లోగా ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీస్‌లో ఆదేశించారు పోలీసులు. 

ఇకపోతే.. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై టి రాజా సింగ్‌ను పోలీసులు ఆగస్టులో అరెస్టు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలోనే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు.. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే రాజాసింగ్‌పై పోలీసుల చర్యలను రద్దు చేయాలని కోరుతూ ఆయన భార్య ఉషా భాయి హైకోర్టు ఆశ్రయించారు. 

ALso REad:అలా చేయకపోతే.. ఇప్పుడున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెనక్కి తీసుకోండి: ఇంటెలిజెన్స్ ఐజీకి రాజాసింగ్ లేఖ

రాజా సింగ్‌పై ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ప్రయోగించిన రెండు నెలల తర్వాత.. పిడి యాక్ట్ అడ్వైజరీ బోర్డు హైదరాబాద్ పోలీసుల నిర్ణయాన్ని సమర్థించింది. అడ్వైజరీ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) కార్యదర్శి వీ శేషాద్రి అక్టోబర్ 19న మెమో కూడా జారీ చేశారు. ఈ క్రమంలోనే హైకోర్ట్ నవంబర్ 9న పీడీ యాక్ట్‌ను కొట్టివేయడంతో రాజాసింగ్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే 3 నెలల పాటు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదని ఆదేశించింది న్యాయస్థానం. అలాగే ప్రెస్‌మీట్లు , రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని సూచించింది. సభలు, సమావేశాలు , ర్యాలీల్లో పాల్గొనకూడదని ఆదేశించింది. ఆగస్ట్ 25న పీడీ యాక్ట్ కింద జైలుకెళ్లారు రాజాసింగ్. 
 

click me!