Hyderabad Metro Fare Hiked: హైదరాబాద్ వాసులకు మెట్రోరైల్ ప్రయాణం మరింత ఖరీదుగా మారింది. ధరలను పెంచుతూ మైదరాబాద్ మెట్రో మరో షాక్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రోరైల్ చార్జీలను అధికారికంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన ధరలు మే 17 నుంచి అమలులోకి రానున్నాయి.
హైదరాబాద్ మెట్రోరైల్ను నిర్వహిస్తున్న లార్సన్ & టూబ్రో మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (LTMRHL) ప్రకటించిన వివరాల ప్రకారం, కనిష్ఠ ఛార్జీ ఇప్పటి వరకు ఉన్న రూ.10 నుంచి రూ.12కు పెరిగింది. అలాగే గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచారు. ప్రయాణ దూరాన్ని బట్టి మిగతా మధ్యస్థ ఛార్జీలు కూడా మారాయి.
0-2 కిలోమీటర్ల దూరానికి: రూ.12
2-4 కిలోమీటర్ల దూరానికి: రూ.18
4-6 కిలోమీటర్ల దూరానికి: రూ.30
ఇలా దూరం పెరిగే కొద్దీ ఛార్జీలు పెరిగి, గరిష్ఠంగా రూ.75 వరకూ ఉన్నాయి.
మెట్రో రైల్ యాజమాన్యం ప్రకారం, ఈ పెంపు వల్ల మెట్రో నిర్వహణ ఖర్చుల భారం తట్టుకోవచ్చని, ఈ నిర్ణయం అనివార్యమైందని పేర్కొంది. పెరిగిన వేతనాలు, విద్యుత్ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు, ఇతర ఆపరేషన్ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పెంపు చేయాల్సి వచ్చిందని తెలిపింది.
ఇకపోతే, ఈ పెంపు నిర్ణయం పై ప్రయాణికులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం మెట్రోపై ఆధారపడే ఉద్యోగులు, విద్యార్థులు ఈ ధరలు సామాన్యులకు భారంగా మారుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.