హైద్రాబాద్ మెట్రోలో సమ్మె: వేతనాల కోసం స్ట్రైక్ చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు

By narsimha lodeFirst Published Jan 3, 2023, 10:26 AM IST
Highlights

హైద్రాబాద్ నగరంలో మెట్రో లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు  మంగళవారంనాడు సమ్మెకు దిగారు. తమకు వేతనాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

హైదరాబాద్: హైద్రాబాద్ మెట్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు  మంగళవారంనాడు సమ్మెకు దిగారు.  వేతనాలు  సక్రమంగా  చెల్లించాలనే  డిమాండ్ తో  తాత్కాలిక ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.ఎల్‌బీనగర్  నుండి మియాపూర్  లైన్ లో  ఉన్న   మెట్రో ఉద్యోగులు  ఆందోళన నిర్వహిస్తున్నారు. తమకు సక్రమంగా జీతాలు కూడా ఇవ్వడం లేదని  వారు ఆరోపిస్తున్నారు. కనీసం భోజనం చేయడానికి కూడా  సమయం ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. హైద్రాబాద్ అమీర్ పేట వద్ద   మెట్రో ఉద్యోగులు ఇవాళ  ధర్నా చేశారు.. హైద్రాబాద్ మెట్రోలోని టికెట్ కౌంటర్లలో  పనిచేస్తున్న  కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఎల్బీ నగర్ నుండి మియాపూర్  లైన్ లో టికెట్ కౌంటర్లలో  సుమారు  300 మంది విధులు  నిర్వహించాలి. కానీ  ఇవాళ  150 మంది మాత్రమే విధులకు హాజరైనట్టుగా సమాచారం.  ఇదిలా ఉంటే టికెట్ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు  సమ్మెకు దిగడంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు.

కొత్తగా విధుల్లో చేరిన  ఉద్యోగులకు  రూ. 11 వేలు, ఐదేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా  రూ. 11 వేల వేతనం మాత్రమే ఇస్తున్నారని కాంట్రాక్టు  ఉద్యోగులు చెబుతున్నారు.  వేతనాలు పెంచాలని గత మాసంలో  హైద్రాబాద్ మెట్రో అధికారులను కాంట్రాక్టు ఉద్యోగులు కోరారు. కానీ  వేతనాలు పెంపు విషయమై  స్పందించలేదని  కాంట్రాక్టు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వేతనాల పెంపు విషయమై స్పష్టత ఇస్తేనే తాము విధులకు హాజరౌతామని  కాంట్రాక్టు ఉద్యోగులు తేల్చి చెప్పారు.  అమీర్ పేట వద్ద మెట్రో ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలుసుకొని పోలీసులు చేరుకున్నారు.   
 

click me!