
హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో కలకలం రేపిన బాలికపై అత్యాచారం, హత్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లా లో అతడిని అరెస్టు చేశారు. రాజు స్వగ్రామం అడ్డగూడూరు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించినట్లు ఎస్ఐ ఉదయ్ కుమార్ వెల్లడించారు.
సింగరేణి కాలనీ లో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. పక్కింట్లో ఉండే రాజు అనే వ్యక్తి ఇంట్లో బాలిక మృతదేహం లభ్యం కావడంతో అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. తూర్పు మండలం డిసిపి రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు నిన్న నిరసన తెలిపారు. చంపాపేట్ నుంచి సాగర్ వెళ్లే రోడ్డు లో దాదాపు ఏడు గంటల పాటు బైఠాయించారు. కలెక్టర్ హామీతో ఆందోళన విరమించారు. ఆందోళనకారుల వద్దకు జిల్లా కలెక్టర్ శర్మన్, డిసిపి రమేష్ రెడ్డి వచ్చి మాట్లాడారు. ప్రభుత్వం తరఫున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, పొరుగు సేవల విభాగంలో ఉద్యోగం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
తక్షణ సహాయం కింద రూ. 50,000 అందజేశారు. బాధిత కుటుంబంలోని మరో ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. చిన్నారి మృతదేహానికి ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. అత్యాచారం చేసి గొంతునులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సైదాబాదులోని సింగరేణి కాలనీలో శుక్రవారం దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక రాజు అనే వ్యక్తి ఇంట్లో అర్థరాత్రి శవమై కనిపించింది. పాపపై రాజు లైంగిక దాడి చేసి, ఆ తర్వాత ఆమెను చంపేసి, శవాన్ని బొంతలో చుట్టి ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాలికను చంపిన తర్వాత రాజు పరారయిన రాజు కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురై ఆందోళనకు దిగారు. రాజును తమకు అప్పగించాలని పోలీసులపై దాడి చేశారు. స్థానికులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడిచేశారు దాంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. 300 మంది పోలీసులతో కాలనీలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీ చౌహాన్ పరిస్థితిని సమీక్షించారు.
నల్లగొండ జిల్లా చందంపేట మండలానికి చెందిన నిందితుడు రాజూ నాయక్ హైదరాబాదులో ఆటో డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. రాజు నాయక్ పోలీసు కస్టడీలోనే ఉన్నాడని, అతన్ని తమకు అప్పగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. అయితే ఘటన తరువాత పరారీలో ఉన్న రాజును శనివారం పోలీసులు యాదాద్రి జిల్లాలో అరెస్ట్ చేశారు.