ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనే ప్రజలు తిరగబడటమే హుజురాబాద్ లో టీఆర్ఎస్ బలహీనతను తెలియజేస్తోంది.
హుజురాబాద్: టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈటల రాజేందర్ బిజెపిలో చేరడంతో హుజురాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడ ఒక్కసారిగా రాజకీయాల సమీకరణలు మారిపోయి అసలు ఊసులోనే లేని బిజెపి పుంజుకోవడం...బలంగా వున్న టీఆర్ఎస్ కాస్త బలహీనంగా మారినట్లు కనిపిస్తోంది. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనే ప్రజలు తిరగబడటమే టీఆర్ఎస్ బలహీనతను తెలియజేస్తోంది.
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. కమలాపూర్ మండలం భీంపెల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మారెడ్డిని గ్రామస్థులు నిలదీశారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ రూమ్, పించన్, దళితులకు మూడెకరాల భూమి ఏదని గ్రామస్థులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. రైతులకు రైతుబందు, భీమా ఇచ్చిన ప్రభుత్వం అసలు భూమి లేని పేదలకు ఏమిచ్చిందని నిలదీశారు.
వీడియో
ఇలా గ్రామస్థులు నిలదీస్తున్న విజువల్స్ చిత్రీకరిస్తున్న వారిని ఎమ్మెల్యే ధర్మారెడ్డి బెదిరించే ప్రయత్నం చేశారు. అంతేకాదు నిలదీసిన పేదలపై కూడా అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆ కార్యక్రమం రసాభాసగా మారింది.