హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను (etela rajender) పోలీసులు హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పౌర స్వేచ్చ లేకుండా పోయిందని మండిపడ్డారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను (etela rajender) పోలీసులు హౌస్ అరెస్ట్ (House Arrest) చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలు చేసేందుకు ఒక్క టీఆర్ఎస్కు మాత్రమే అనుమతులు ఉంటాయా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా దెబ్బలు తిన్నవారిపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని విమర్శించారు. గాయపడినవారికి ధైర్యం చెప్పే స్వేచ్చ కూడా లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో పౌర స్వేచ్చ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ఏపీ విభజనపై మోదీ వ్యాఖ్యలను ఖండిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు బుధవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనగామలో మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఇందులో తమ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారని బీజేపీ నేతలు తెలిపారు.
బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు నిరసనగా జనగామలో గురువారం బీజేపీ మౌనదీక్షకు పిలుపునిచ్చింది. అయితే టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జనగామ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈటల రాజేందర్ను హౌస్ అరెస్ట్ చేశారు.