భార్య ప్రియుడిని చంపించిన భర్త
ఈ నెల 3న సాదుల్లానగర్లో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ దారుణానికి అక్రమ సంబంధమే కారణమని దర్యాప్తులో తేల్చారు. పోలీసుల కథనం ప్రకారం హత్నూర్ మండలంలోని సాదుల్లానగర్కు చెందిన ఎర్రోళ్ల ప్రభాకర్ భార్యకు అదే గ్రామానికి చెందిన చెక్కల భాస్కర్తో వివాహేతర సంబంధం ఉంది. ప్రభాకర్ భార్య.. చెక్కల భాస్కర్కు వరుసకు చెల్లి అవుతుంది. వావి వరసలు మరచి చెల్లితో ఇలా ఉండటం తప్పని.. పద్దతి మార్చుకోవాలని ప్రభాకర్ పలుమార్లు భాస్కర్ను మందలించారు. అయినా అతనిలో ఎంతకు మార్పు రాకపోవడంతో.. భాస్కర్ను చంపాలని నిర్ణయించాడు.
తన తమ్ముళ్లయిన ఎర్రోళ్ల రమేశ్, వీరేశం, బోయిన శ్రీధర్తో పాటు జిన్నారం మండలం మంగంపేట గ్రామానికి చెందిన బావ మాచబోయిన శ్రీకాంత్తో కలిసి భాస్కర్ హత్యకు కుట్ర పన్నాడు. అయితే అందుకు ధైర్యం సరిపోకపోవడంతో.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన పాత నేరస్థుడు నరేశ్ గౌడ్తో బేరం కుదుర్చుకున్నాడు. దీంతో నరేశ్ గౌడ్ తన స్నేహితులైన ప్రేమ్ కుమార్, తొంట వినయ్ కుమార్లతో కలిసి భాస్కర్ను చంపేందుకు పథకం వేశాడు..
ప్లాన్ ప్రకారం ఈ నెల 3న మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భాస్కర్ ఇంట్లో ఉన్న సమయంలో ప్రభాకర్తో పాటు మిగిలిన వారు అతనిపై దాడి చేశారు.. కళ్లలో కారం చెల్లి బయటకు తీసుకువచ్చి.. చావబాదారు.. వీరంతా అతడిని పట్టుకుని ఉండగా.. ప్రభాకర్ అతని చేతిని విరగొట్టి హత్య చేశాడు. ఈ సంఘటన గ్రామంలో సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యానంతరం నిందితులు ఎవరికి కనిపించకుండా కొన్ని రోజులు తలదాచుకున్నారు. అయితే గురువారం గుమ్మదిదల పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా... ఒక వాహనంలో అనుమానాస్పదంగా కనిపించిని 8 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మొత్తం భండారం బయటపడింది. దీంతో ప్రభాకర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొని.. అతనితో పాటు హత్యకు సహకరించిన మొత్తం 8 మందిని రిమాండ్కు తరలించారు.