
నల్గొండ : భార్య వివాహేతర సంబంధాల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా నల్గొండ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. మరొక వ్యక్తితో భార్య సఖ్యతగా ఉండడం చూసిన ఓ వ్యక్తి మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామంలో బుధవారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్సై బాలకృష్ణ ఈ మేరకు వివరాలు తెలిపారు.
పద్నాలుగు సంవత్సరాల ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన హసీనాతో, రఘునాధపాలెం గ్రామానికి చెందిన ముత్యాలంపాటి సిద్దయ్య (36)కు వివాహం అయ్యింది. సిద్దయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొంతకాలంగా హసీనా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని సిద్ధయ్యకు అనుమానం వచ్చింది.
సిద్దిపేటలో మహిళ దారుణ హత్య.. గొంతు కోసి, కాళ్లు నరికి పైశాచికం..
ఈ అనుమానంతోనే గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా పెట్టించాడు. అయినా కూడా ఆమెను తీరులో మార్పు రాలేదు. ఇదే విషయంగా కొద్ది రోజుల క్రితం ఇంట్లో మళ్లీ గొడవ జరిగింది. దీంతో హసీనా తన ఇద్దరు కొడుకులను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటినుంచి వీరి ఇంటి పక్కనే ఉన్న చిన్నాన్న ఇంట్లో సిద్దయ్య ఇద్దరు కొడుకులు ఉంటున్నారు.
భార్య తీరులో ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాకపోవడంతో సిద్దయ్య తీవ్రమనస్థాపం చెందాడు. దీంతో తెల్లవారుజామున ఇంట్లోని ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లారిన తర్వాత సిద్దయ్య సోదరుడు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గమనించారు.
వెంటనే హుటాహుటిన అతడిని కిందికి దింపేసరికి అప్పటికే సిద్దయ్య మృతి చెందాడు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించడం కోసం మృతదేహాన్ని హుజూర్నగర్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు బ్రహ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు.