
రంగారెడ్డి జిల్లాలో ఘారానా మోసం వెలుగుచూసింది. అధిక వడ్డీ ఆశచూపి కేపీడబ్ల్యూ క్రిప్టో కంపెనీ, ఈ స్టోర్ ఇండియా పేరుతో కొందరు వ్యక్తులు జనాల నుంచి భారీగా డబ్బులు దండుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండల కేంద్రానికి చెందిన సుఫియాన్, అతడి సోదరులు పెట్టుబడుల పేరుతో ఈ డబ్బులు వసూలు చేశారు. రూ. లక్షకు నెలకు రూ. 9 వేల వడ్డీ ఇస్తామని ఆశ చూపారు. ఇలా వందాలది మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. తొలుత కొందరికి నెలవారీ వడ్డీ చెల్లించడంతో మిగిలిన వారు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఈ విధంగా బాధితుల నుంచి నిందితులు రూ. 35 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల నెలవారీ చెల్లింపులు నిలిచిపోవడంతో తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుల్లో యాచారం, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం మండలాలకు చెందినవారితో హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారు ఉన్నారు. బాధితుల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్టుగా సమాచారం.