
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐ విచారణ కొరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరిగింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సిట్ నుంచి సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు బదిలీ చేయాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది వివేక్ వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తు సరిగా జరగడం లేదని అన్నారు. సిట్ దర్యాప్తులో మంత్రి కేటీఆర్ జోక్యం ఉందని చెప్పారు. ఐటీ అంశాలపై దర్యాప్తుకు సిట్లో ఐటీ నిపుణులు లేరని చెప్పారు.
మరోవైపు ఈ కేసు దర్యాప్తు ఉన్నందున పిటిషన్ కొట్టేయాలని టీఎస్పీఎస్సీ కోరింది. ఇప్పటికే సిట్ నివేదికను సమర్పించామని ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. అడిషనల్ నివేదిక కూడా సబ్మిట్ చేస్తామని చెప్పారు. సిట్ విచారణలో భాగంగా 40 మందిని ప్రశ్నించిందని తెలిపారు. ఇప్పటికే 12 కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక ఇంకా రాలేదని చెప్పారు.
ఈ క్రమంలోనే హైకోర్టు ధర్మాసనం.. సిట్లో ఐటీ నిపుణులు ఉన్నారా? అని ప్రశ్నించింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలను విచారణకు ఎందుకు పిలిచారని? వారి నుంచి ఏదైనా సమాచారం సేకరించారా? అని కూడా ప్రశ్నించింది. అయితే టీఎస్పీఎస్సీ పరీక్షలు రద్దు, వాయిదా మంచి పనే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక, ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. ఈరోజు తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది.