
హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ''గ్రీన్ ఇండియా ఛాలెంజ్'' లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొన్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్ తన నివాసంలో మూడు మొక్కలు నాటి మూడవ దశ ''గ్రీన్ ఇండియా ఛాలెంజ్'' శ్రీకారం చుట్టారు. ఈ ఛాలెంజ్ ను ప్రారంభించిన సంతోష్ కుమార్ దగ్గరుండి మరీ ప్రభాస్ చేత మొక్కలు నాటించారు.
అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ... ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ఉన్నతమైన విలువలతో కూడుకున్నదని అన్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్యక్రమం నన్ను ఇన్ స్పైర్ చేసిందన్నారు. అందుకే వారి స్పూర్తితోతాను కూడా వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నానని ప్రభాస్ వెల్లడించారు.
read more రెండు నెలల తరువాత కెమెరా ముందుకు డార్లింగ్.. ప్రభాస్ గ్రీన్ ఛాలెంజ్
సంతోష్ కుమార్ గారి మహోన్నతమైన ఆశయం ముందుకు పోవాలంటే మనమంతా వారి ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందని.... అప్పుడే సమాజం బావుంటుందని ప్రభాస్ అన్నారు. అందుకే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తన అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని ప్రభాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కొనసాగింపుగా మెగాపవర్ స్టార్ రాంచరణ్, భల్లాలదేవ దగ్గుబాటి రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేశారు ప్రభాస్.
అనంతరం జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ది చాలా మంచి మనసని... సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడని కొనియాడారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆశయం తెలుసుకున్న వెంటనే మూడు మొక్కలు నాటడం, సహృదయంతో ఒక రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధికి పూనుకోవడం స్పూర్తిదాయకమన్నారు. ఇంత మంచి మనస్సున్న ప్రభాస్ చేతులమీదగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ దశ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమన్వయకర్త సంజీవ్ రాఘవ తదితరులు పాల్గొన్నారు.