హైదరాబాద్‌లో మళ్లీ కుండపోత : భారీగా ట్రాఫిక్ జాం.. వాహనదారుల అవస్థలు

By Siva KodatiFirst Published Oct 17, 2020, 9:05 PM IST
Highlights

వరుణ దేవుడు హైదరాబాద్‌పై పగబట్టినట్లుగా ఉంది . వరద బురద నుంచి నగరవాసులు ఇంకా కోలుకోకముందే భాగ్యనగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తుండటం నగరవాసుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. 

వరుణ దేవుడు హైదరాబాద్‌పై పగబట్టినట్లుగా ఉంది . వరద బురద నుంచి నగరవాసులు ఇంకా కోలుకోకముందే భాగ్యనగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తుండటం నగరవాసుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది.

కూకట్‌పల్లి, ప్రగతి నగర్, జేఎన్‌టీయూ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్‌లో భారీ వర్షం పడుతోంది. అటు దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట్, ఎల్బీ నగర్‌లలో కుంభవృష్టి కురుస్తోంది.

మరోవైపు వచ్చే రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈశాన్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కూడా తోడయ్యింది.

Also Read:హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం, పోటెత్తుతున్న వరద : తృటిలో తప్పిన ప్రమాదం

దీంతో వచ్చే మూడు రోజులు తెలంగాణ భారీ వర్షం ముప్పు పొంచి వుంది. ఇక చైతన్య పురిలో భారీ వర్షానికి వరద నీరు రోడ్లను ముంచెత్తింది. వరదలో కొట్టుకుపోయిన నలుగురిని కమలానగర్ కాలనీ వాసులు రక్షించారు.

భారీ వర్షానికి సాయంత్రం కార్యాలయాల నుంచి వచ్చే వారు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోవడంతో వారు కంగారు పడుతున్నారు.

ప్రధాన రహదారులు జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఎల్బీ నగర్- వనస్థలిపురం, అబ్ధుల్లాపూర్‌మెట్- ఇనామ్‌గూడ హైవే, మేడిపల్లి- ఉప్పల్, బీఎన్ రెడ్డి నగర్, సాగర్ రింగ్ రోడ్‌పై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.

గంట నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. అటు నాగోల్ బండ్లగూడ ధనలక్ష్మీనగర్‌లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. 

click me!