
హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురుసింది. ఈదరుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో కొన్నిచోట్ల పిడుగులు పడ్డాయి. జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షంతో కల్లాలో ఉన్న ధాన్యం తడిసిముద్దకావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. భారీ వర్షం కారణంగా జగిత్యాల-నిజమాబాద్ జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలను తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కొన్నిచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొంతమేర ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో ప్రభుత్వ జాప్యం వల్ల ధాన్యం నిల్వలు నిలిచిపోయాయని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేవని రైతులు చెబుతున్నారు. అధికారులు త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇక, ఆర్మూరులో విద్యుత్, రెవెన్యూ కార్యాలయాలపై పిడుగులు పడ్డాయి. విద్యుత్ కార్యాయలంలోని 16 కంప్యూటర్లు, 6 ప్రింటర్లు దగ్దం అయ్యాయి.
ఇక, హైదరాబాద్ నగరంలోనూ సోమవారం తెల్లవారుజామున స్వల్పంగా వర్షం కురిసింది. దీంతో గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో సతమతవుతున్న నగరవాసులకు కాసింత ఉపశమనం కలిగింది. చల్లని గాలులు వీస్తుండటంతో హైదరాబాదీలు వెదర్ను ఎంజాయ్ చేస్తున్నారు.
నేడు తెలంగాణలో మోస్తరు వర్షాలు..
తెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రపై 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు బిహార్ నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు గాలులతో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణలో సోమవారం అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. అయితే వర్షాలు కురవని చోటు వేసవి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం కంటే మూడు డిగ్రీలు అదనంగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.