
ఒక యువకుడు ప్రమాదవశాత్తూ రైలు కింద జారి పడిన ఘటన...రెండు రాష్ట్రాల రైల్వే పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. వివరాల్లోకి వెళితే...సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్లే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మెట్ల వద్ద కూర్చొనొ ఓ గుర్తు తెలియని యువకుడు ప్రయాణించాడు.
ఈ క్రమంలో అతను ప్రమాదవశాత్తూ కిందకు జారిపడ్డాడు. జనగామ-రఘనాథపల్లి స్టేషన్ల మధ్య గుర్తు తెలియని యువకుడి మొండెం... ఇతర శరీరభాగాలు నుజ్జు నుజ్జయి కనిపించాయి.
తల కోసం ఎంతగా గాలించిన రైల్వే పోలీసులకు ఎక్కడా దొరకలేదు. దీంతో మొండెంను వరంగల్ ఎంజీఎంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వేస్టేషన్ సిబ్బంది రైలు మెట్లకు ఓ యువకుడి తల చిక్కుకుని ఉండటాన్ని గుర్తించి భయాందోళనలకు గురయ్యారు. వెంటనే విషయాన్ని రైల్వే పోలీసులకు తెలిపారు.
హత్య చేసి ఎవరైనా తలను రైలుకు కట్టారా..? లేదంటే ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. సికింద్రాబాద్ - నాగపూర్ మధ్యలోని అన్ని రైల్వేపోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు.
దీంతో రఘనాథపల్లి వద్ద దొరికిన మొండెం తాలుకూ తలేనని ఖాజీపేట రైల్వే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వెంటనే నాగపూర్ వెళ్లి తలతో పాటు ఎరుపు రంగు బనియన్ ముక్కలు తీసుకొచ్చారు. అవి మొండెం మీదున్న దుస్తులతో సరిపోలడంతో అది ఇతనిదేనని ధ్రువీకరించారు. కాగా మరణించిన వ్యక్తి ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.