ఆపరేషన్ కొడంగల్: టార్గెట్ రేవంత్ రెడ్డి, హరీష్ వ్యూహం ఇదీ...

First Published Aug 6, 2018, 12:50 PM IST
Highlights

కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డిని కొడంగల్ నియోజకవర్గంలో ఎదుర్కోవడానికి తెలంగాణ మంత్రి హరీష్ రావు పక్కా వ్యూహ రచన చేసినట్లు కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో ఓడించడమే ధ్యేయంగా ఆయన పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌: కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డిని కొడంగల్ నియోజకవర్గంలో ఎదుర్కోవడానికి తెలంగాణ మంత్రి హరీష్ రావు పక్కా వ్యూహ రచన చేసినట్లు కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో ఓడించడమే ధ్యేయంగా ఆయన పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నారు. 

హరీష్ రావుతో పాటు మంత్రులు నాయని నర్సింహా రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కొడంగల్ లో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డిని లక్ష్యం చేసుకుని విమర్శలు చేయడం కన్నా తమ ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడానికే వారు ప్రాధాన్యం ఇచ్చారు. 

రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే అభివృద్ధిని వివరించే అవకాశం కోల్పోతామని వారు భావించినట్లు తెలుస్తోంది. హరీష్ రావు వ్యూహరచనలో భాగంగానే వారంతా నడుచుకున్నట్లు తెలుస్తోంది.  కొడంగల్ లో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను హరీష్ రావు పొల్లు పోకుండా వివరించారు. ఆ రకంగా ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. 

నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనాల్లో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తద్వారా తెలంగాణ మంత్రులకు ఆయన కౌంటర్ ఇచ్చారని భావిస్తున్నారు. కోస్గి బస్సు డిపో శంకుస్థాపన కార్యక్రమంలో ఎలాంటి వ్యతిరేకతను ప్రకటించడకుండా రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. డిపో ఏర్పాటుకు రేవంత్‌రెడ్డి 2013లోనే సొంత డబ్బులతో 4 ఎకరాల భూమిని కొని, ఆర్టీసీకి అందించారు. 
 
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డిని బరిలో దింపాలనే యోచన చేసింది. అయితే ఇక్కడ గతంలో 9 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి, ఐదు సార్లు విజయం సాధించిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డిని నరేందర్‌రెడ్డికి సహకరించేలా టీఆర్‌ఎస్‌ అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

కొత్తగా ఏర్పాటు చేసిన కొడంగల్‌ కమిటీ చైర్మెన్‌ పదవితో పాటు రాష్ట్ర స్థాయిలో మరో కీలక పదవిని గురునాథ్‌రెడ్డికి, అతని వర్గీయులకు ఇవ్వాలని భావిస్తోంది. 

click me!