కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ దాసోజు స్పందించారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ది అధికార దాహం... టిఆర్ ఎస్ ది అభివృద్ది దాహం అంటు మంత్రి హారీష్ రావు మాట్లాడడం వింతగా ఉందన్నారు.
కాంగ్రెస్ది అధికార దాహమే అయితే నేడు టిఆర్ ఎస్ ఉండకపోయేదన్నారు. టిఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేసుకొని తెలంగాణ ఇచ్చే వాళ్ళమని కేసిఆర్, హరీష్ రావులు ఇప్పుడు గాంధీభవన్లో తిరిగే వారని అన్నారు.
రాజకీయంగా నష్టపోతామని తెలిసినా కూడా ప్రజల కోరిక మేరకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చామని ఆయన అన్నారు. అధికారం దాహంతోనే టిఆర్ ఎస్ కాంగ్రెస్, టిడిపి, వైఎస్ఆర్సిపి, బిఎస్పి, సిపిఐ లకు చెందిన ఎం.ఎల్.ఎలు, ఎం.ఎల్.సిలు, ఎం.పిలు, ప్రజా ప్రతినిధులందరినీ పార్టీలో చేర్చకుందని అన్నారు.
తెలంగాణకు బద్ధ శత్రువులైన తుమ్మల, తలసాని, మహేందర్ రెడ్డి, కొండా దంపతులు, మైనంపల్లి లాంటి వాళ్ళు అంతా ఇప్పడు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం చేసిన వారు నేడు ఉరి వేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే తెలంగాణ ఉద్యమ ద్రోహులు నేడు మీ పక్కన ఉండి అధికారం చెలాయిస్తున్నారని ఎవరిది అధికారం దాహం, ఎవరిది అభివృద్ది దాహమో తెలంగాణ ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.