
హైదరాబాద్ శివార్లలో శామీర్పేట్ కాల్పుల ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. భార్యభర్తల విభేదాలు రావడంతో.. భార్య పిల్లలతో పాటు భర్తకు దూరంగా ఉంటుంది. మరో వ్యక్తితో ఆమె సహజీనం చేస్తున్నారు. వివరాలు.. సిద్దార్థ్ దాస్, స్మితలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో కొడుకు, కూతురు ఉన్నారు. అయితే 2019లో విభేదాలతో భర్తకు స్మిత దూరమయ్యారు. అయితే స్మితకు మనోజ్కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నారు. వారు ప్రస్తుతం సెలబ్రిటీ రిసార్ట్లోని ఓ విల్లాలో నివాసం ఉంటున్నారు. అయితే పిల్లలను కూడా స్మిత తన వద్దే ఉంచుకుంది.
సిద్దార్థ్ దాస్ పిల్లలను చూసుకునేందుకు స్మితా ఉంటున్న విల్లాకు వచ్చారు. ఈ క్రమంలోనే అక్కడ జరిగిన ఘర్షణలో మనోజ్ కుమార్ ఎయిర్గన్తో కాల్పులు జరిపాడు. ఈ విషయంపై సిద్దార్థ్ దాస్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక, అది ఎయిర్గన్ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. ఇక, పిల్లలను మనోజ్ కొడుతున్నట్టుగా సిద్దార్థ్ దాస్ ఆరోపిస్తున్నారు. అయితే స్మితా మాత్రం అలాంటిదేమి లేదని చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలాఉంటే, ఇప్పటికే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సిదార్థ్-స్మితాల కొడుకు లేఖ రాశాడు. అందులో మనోజ్ తమతో పనులు చేయించడంతో పాటు వేధిస్తున్నాడని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇటీవల సిదార్థ్-స్మితాల కొడుకును వారి సంరక్షణలో ఉంచింది. అయితే తనతో పాటు చెల్లిని కూడా మనోజ్ కొడుతున్నాడని.. సీడబ్ల్యూసీతోపాటు, తన తండ్రి సిద్దార్థ్ దాస్కు చెప్పాడు. ఈ క్రమంలోనే సిద్దార్థ్ దాస్ విశాఖ నుంచి శామీర్పేట్కు చేరుకున్నాడు.
ఇక, సిద్దార్థ్ వైజాగ్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇక, స్మిత, మనోజ్లు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నట్టుగా చెబుతున్నారు. మనోజ్ కొన్ని సీరియల్స్లో కూడా నటించారనే కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టుగా వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు.