
టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద పలువురు గ్రూప్ -2 అభ్యర్థులు, పలు సంఘాలు నేతలు ధర్నా చేపట్టారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు గ్రూప్-2 అభ్యర్థులు, పలు సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. అయితే ఈ ధర్నాతో గన్పార్క్ పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు.
మరోవైపు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం రోజున గన్ పార్క్ వద్ద శాంతి యుతంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. గురుకుల టీచర్, పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ పోస్టుల పరీక్షలు పూర్తైన తర్వాత గ్రూప్- 2 పరీక్ష నిర్వహించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు ఆర్ఎస్ ప్రవీణ్ను బయటకు రాకుండా.. హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన ఇంట్లోనే దీక్షను కొనసాగిస్తున్నారు.
‘‘తెలంగాణలో తమ భవిష్యత్తు కోసం ప్రభుత్వంతో వీరోచిత పోరాటం చేస్తున్న లక్షలాది నిరుద్యోగ బిడ్డలకు సంఘీభావంగా, గ్రూప్2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలన్న డిమాండ్ను పూర్తిగా సమర్థిస్తూ, ఈ రోజు మేము గన్ పార్క్ దగ్గర ‘శాంతియుతంగా’ సత్యాగ్రహం చేద్దామని నిర్ణయించాము. కానీ కేసీఆర్ ప్రభుత్వం నన్ను, మా నాయకులనందరినీ గృహ నిర్భందంలో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బీఎస్పీ కార్యకర్తలను పోలీసులు నిర్భందించారు. అయినా మేం సత్యాగ్రహాన్ని కొనసాగిస్తున్నాం. తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకూ మా పోరాటం వివిధ రూపాల్లో తెలంగాణ గడ్డ మీద కొనసాగుతూనే ఉంటది. కేసీఆర్ తన పోలీసు బలగాలతో మా ప్రజాస్వామిక హక్కులను కాలరాసినా తెలంగాణ తన విముక్తి పోరాటం ఆపదు. కొందరి పాలైన తెలంగాణ, అందరి తెలంగాణ గా మారేదాకా మడమ తిప్పేది లేదు’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.