
హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్లో జనావాసాల మధ్య మహిళ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. శంషాబాద్ మున్సిపల్ కేంద్రం శ్రీనివాస ఎన్క్లేవ్ సమీపంలోని ఓ బహిరంగ ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే హత్యకు గురైన మహిళను శంషాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాళ్లగూడదొడ్డికి చెందిన వడ్ల మంజులగా గుర్తించారు. ఈ మేరకు తెలుగు న్యూస్ చానల్ ఎన్టీవీ రిపోర్టు చేసింది.
ఇక, రెండు రోజుల క్రితం కడుపు నొప్పి వస్తుందని మంజుల భర్త లక్ష్మయ్యకు చెప్పింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చింది. అయితే మంజుల కనిపించడం లేదని శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఆమె భర్త లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మంజులను ఎవరు చంపారు?, హత్యకు గల కారణాలు ఏమిటనే కారణాలు కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇక, ఓ మహిళ మృతదేహం కాలిపోతున్నట్లు గురువారం అర్ధరాత్రి తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. తాము సంఘటనా స్థలానికి చేరుకుని.. సగం కంటే ఎక్కవ కాలిన స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించడం జరిగిందని చెప్పారు. అనంతరం కాలిన స్థితిలో ఉన్న మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం చేశారు. క్లూస్ టీమ్ ఘటన స్థలంలో ఆధారాలు సేకరించింది. కాలిపోయిన మహిళా డెడ్ బాడీ దగ్గర అగ్గిపెట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీమ్ లతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలించారు.
మహిళను హత్య చేసి సజీవ దహనం చేశారా? లేక మృతదేహానికి నిప్పంటించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని శంషాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామచంద్రరావు తెలిపారు. పోస్టుమార్టమ్ నివేదిక తర్వాత ఈ విషయంలో కొంతమేర నిర్ధారణకు వచ్చేందుకు అవకాశం ఉంటుందని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇక, నిందితుల ఆచూకీ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. తొండుపల్లిలోని ఓ పెట్రోల్ బంక్ నుంచి ఓ అనుమానితుడు పెట్రోల్ కొనుగోలు చేసినట్లు సమాచారం. మహిళకు నిప్పంటించడంలో మరో వ్యక్తి అతనికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.