నిజామాబాద్‌లో వధువు ఆత్మహత్య ... ఫోన్ చేసిన మాట వాస్తవమే, వేధించలేదు : పెళ్లికొడుకు

By Siva KodatiFirst Published Dec 11, 2022, 5:11 PM IST
Highlights

వివాహానికి కొద్దిగంటల ముందు పెళ్లి కుమార్తె రవళి ఆత్మహత్య వ్యవహారం నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై పెళ్లికుమారుడు సంతోష్ స్పందించాడు. 

మరికొద్దిగంటల్లో వివాహం జరగాల్సి వుండగా పెళ్లి కుమార్తె ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. పెళ్లికుమారుడి వేధింపుల వల్లే వధువు రవళి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై వరుడు సంతోష్ స్పందించాడు. తాను రవళిని వేధించలేదని, రాత్రి ఫోన్‌లో మాట్లాడిన మాట నిజమేనని అంగీకరించాడు. అయితే ఫోటోషూట్ కోసం పెళ్లి మండపానికి తొందరగా రమ్మని చెప్పినట్లు సంతోష్ అన్నాడు. పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలని చెప్పింది నిజమేనని, అందుకు రవళి కూడా ఒప్పుకుందని తెలిపాడు. అదనపు కట్నం కావాలని ఎప్పుడూ వేధించలేదని.. ఇలా జరుగుతుందని ఊహించలేదని సంతోష్ పేర్కొన్నాడు. తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని.. ఏ విచారణకైనా తాను సిద్ధమేనని వరుడు ప్రకటించాడు. 

కాగా... నిజామాబాద్ జిల్లా నవీపేటలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన రవళి అనే యువతి  తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.  కుటుంబ సభ్యులు  పెళ్లి పనుల్లో  బిజీగా ఉన్న సమయంలో ఈ  ఘటన చోటు చేసుకుంది. తన  గదిలోకి వెళ్లిన రవళి  ఆత్మహత్యకు పాల్పడింది. కాబోయే భర్త  వేధింపులు భరించలేక రవళి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ALso REad:నిజామాబాద్‌ జిల్లాలో విషాదం: పెళ్లి పీటలెక్కాల్సిన రవళి ఆత్మహత్య

శనివారం నాడు రాత్రి కూడా రవళికి కాబోయే భర్త ఫోన్ చేశాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆదివారం నాడు తెల్లవారుజామున  నాలుగు గంటల సమయంలో  రవళి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు పెళ్లి కూతురుగా పెళ్లి పీటలు ఎక్కాల్సిన  రవళి ఆత్మహత్య చేసుకోవడంతో  కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి కోసం రవళి ఇంటి ముందు  ఘనంగా ఏర్పాట్లు చేశారు.  రవళి  ఆత్మహత్య చేసుకోవడంతో  ఇంటి వద్ద ఏర్పాటు చేసిన  పెండ్లి పందిరిని తొలగించారు.  పెళ్లికి ముందు శనివారంనాడు ఏర్పాటు చేసిన హల్దీ  ఫంక్షన్ లో  రవళి  తన బంధువులతో కలిసి ఉత్సాహంగా  డ్యాన్స్ చేసింది.  అంతలోనే ఈ దారుణం జరగడం అందరినీ కలచివేస్తోంది.

click me!