
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో జరిగిన గ్రామసభ రసాభాసగా మారింది. మోడల్ విలేజ్ నిర్మాణానికి తీర్మానం కోసం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా జీపీ తీర్మానం ఆమోదిస్తున్నట్లు సర్పంచ్ ఎలా చెప్తారని పలువురు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పునర్నిర్మాణంపై గ్రామసభ కంటే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే గ్రామ పునర్నిర్మాణానికి సంబంధించి గ్రామపంచాయితీ తీర్మానంపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గ్రామ సభ మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు గ్రామస్తులు మాత్రం తమ అనుమానాలపై స్పష్టత ఇచ్చాకే గ్రామ పునర్మిణంపై తీర్మానం చేయాలని కోరుతున్నారు.
ఇక, ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉందని.. గ్రామ పుననిర్మాణం జరిగే లోపే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. ఎన్నికల్లో ప్రభుత్వం మారితే గ్రామం పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏడాదిన్నరలోపే నిర్మాణం పూర్తి చేయించే విధంగా తీర్మానం చేయించాలని గ్రామస్తులు కోరారు. అయితే గ్రామ సర్పంచ్ మాత్రం ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెబుతున్నారు. ఈ విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.