కరోనాతో గవర్నమెంట్ టీచర్ మృతి... భద్రాద్రి జిల్లాలో మళ్లీ కలకలం

By Arun Kumar PFirst Published Sep 22, 2021, 11:53 AM IST
Highlights

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మళ్లీ కరోనా కలకలం రేగింది. జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్ కరోనాతో మృతిచెందడమే ఈ కలకలానికి కారణమయ్యింది. 

ఖమ్మం: తెలంగాణలో కరోనా (Corona Virus) మహమ్మారి మరో ఉపాధ్యాయురాలి ప్రాణాన్ని బలితీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్ (Covid19) కేసులు బాగా తగ్గడంతో స్కూల్స్ ని తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. తాజాగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కరోనా బారినపడి మృతి చెందడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. 

వివరాల్లోకి వెళితే... భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలంలో ఎస్.కె నగర్ లో గవర్నమెంట్ టీచర్ విజయలక్ష్మి కుటుంబంతో కలిసి వుండేది. ఆమె జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. కరోనా కారణంగా చాలాకాలంగా మూతపడ్డ స్కూల్స్ ఇటీవలే తెరుచుకోవడంతో విజయలక్ష్మి పాఠశాలకు వెళుతోంది. ఇలా గత శనివారం కూడా స్కూల్ వెళ్లి విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పారు. 

అయితే ఆదివారం కరోనా లక్షణాలు లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆమె హోంఐసోలేషన్ లో వుంటూ చికిత్స పొందారు. కానీ సోమవారం శ్వాస సమస్య ఏర్పడి తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు హాస్పటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న విజయలక్ష్మి ఆరోగ్యం మరింత క్షీణించి రాత్రి తుదిశ్వాస విడిచారు. 

ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి కరోనాతో మరణించిన తెలియడంతో పడమటనర్సాపురం పాఠశాలలో చదివే విద్యార్థులతో పాటు టీచర్స్ లోనూ ఆందోళన నెలకొంది. దీంతో మండల విద్యాశాఖ అధికారి వెంకట్  స్కూల్లో పనిచేసే సిబ్బంది, విద్యార్ధులకు టెస్టులు చేయించే ఏర్పాటు చేశారు.  మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భూక్యా వీరబాబు ఆధ్వర్వంలో 124 మంది విద్యార్థులు, 16 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు మధ్యాహ్న భోజన వర్కర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్‌ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

click me!