
‘నువ్వు’ అన్నందుకు ఓ వ్యక్తిని చితకబాదిన దారుణ సంఘటన హైదరాబాద్ సైదాబాద్ లో కలకలం రేపింది. సంఘటన జరగగానే దీనిపై సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన బాధితుడి భార్య, ఉదయమే వచ్చి కేసు వాపసు తీసుకుంటాననడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
కర్ణాటక, గుల్బర్గకు చెందిన గ్యాంగ్స్టర్ సుంకరి సతీష్ అలియాస్ మార్కెట్ సతీష్ పై హత్య, కిడ్నాప్, దోపిడీతోపాటు ఇతర కేసులు అక్కడి పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి. ఎన్ కౌంటర్ కు భయపడి సైదాబాద్ లోని పూసల బస్తీలో అజ్ఞాతంగా ఉంటున్నాడు.
ఇక్కడ బంధువులు ఉండటంతో ఇక్కడే ఓ పాత ఇల్లు కొని, దాన్ని కూల్చి కొత్త భవనం కడుతున్నాడు. ఆదివారం దసరా ఉత్సవాల్లో భాగంగా పూసల బస్తీకే చెందిన పొదిల రాజేష్ కుమార్ కుటుంబంతో కలిసి శివాంజనేయస్వామి గుడికి వచ్చాడు. ఆలయం దగ్గర అందరూ వచ్చి సతీష్కు దసరా శుభాకాంక్షలు చెప్పారు. రాజేష్ కూడా సతీష్ ను నువ్వు అంటూ శుభాకాంక్షలు చెప్పాడు.
దీంతో ఆగ్రహించిన సతీష్, అతడి అనుచరులు రిత్విక్.. రాజేష్ కుమార్పై దాడి చేశారు. సతీష్, రిత్విక్ ఇంటికి వెళ్లి కత్తి, రాడ్లు తీసుకువచ్చి మరోసారి దాడికి యత్నించారు. ఆ సమయంలో పోలీసులు అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో సతీష్ ‘నాలుగు హత్యలు చేశాను. మిమ్నులను కూడా చేస్తా’ అని పోలీసుల ముందే బెదిరించాడని బాధితులు తెలిపారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజేష్ను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే బాధితుడి భార్య అర్ధరాత్రి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న సతీష్, అతడి అనుచరులు బాధిత కుటుంబాన్ని బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, రాజేశ్ భార్య సోమవారం ఉదయం ఆరు గంటలకే సైదాబాద్ పోలీష్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు వాపస్ తీసుకుంటామని పోలీసులను వేడుకుంది.
సతీష్ కోసం కర్ణాటకలో సతీష్పై హత్య, కిడ్నాప్, దోపిడీలకు సంబంధించి 23 కేసులు పెండింగ్ ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రలో కూడా రౌడీ షీట్ నమోదయింది.