
మహిళకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా.. ఆ తతంగాన్ని మొత్తాన్ని వీడియో తీసి.. దానిని చూపించి బెదిరించారు. కాగా.. బాధితురాలు వారి బెదిరింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించడంతో.. అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఖమ్మంలోని పాల్వంచలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన కాల్వ కళావతి ఇంట్లో ఓ మహిళ పనిమనిషిగా చేస్తోంది. జనవరి 13న కళావతి ఇంటికి సయ్యద్ హుస్సేన్, కాల్వ రామారావు, కాల్వ సుమతి, ఉబ్బన మాణిక్యం అనే వ్యక్తులు వచ్చారు. ఆ సమయంలో పనిమనిషి ఇంట్లో పనులు పూర్తి చేసుకుని వెళ్తుండగా.. టీ తాగాలని కళావతి సూచించింది.
టీలో అప్పటికే మత్తు మందు కలిపారు. ఆ టీ తాగిన పనిమనిషి వెంటనే స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం పనిమనిషిపై సయ్యద్ హుస్సేన్ అత్యాచారం జరపగా, కళావతి వీడియో తీసింది. బాధితురాలు తేరుకున్న తర్వాత.. విషయం బయటకు చెబితే వీడియోలు ఇంటర్నెట్లో పెడతానని బెదిరించింది. రూ.5 లక్షలు ఇవ్వాలని కొన్ని రోజులుగా వేధిస్తోంది.
దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రతీష్ ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన సయ్యద్ హుస్సేన్ను అదుపులోకి తీసుకున్నారు. మిగతావారు పరారీలో ఉన్నట్లు సమాచారం.