
ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్. ఖమ్మంలో జరుగుతున్న కాంగ్రెస్ జనగర్జన సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు. నిర్బంధపూరితంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందని.. ఇలాంటి నిర్బంధాలే పతనానికి నాంది అన్నారు. ప్రజలు చైతన్యవంతులై ఇలాంటి నిర్బంధాలను ఛేదించాలని గద్దర్ పిలుపునిచ్చారు. ఉపా కేసులు వున్నప్పటికీ తాను పాడటం మానేయలేదన్నారు. తాను కోరుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరానని.. కానీ ఇప్పటికే పార్టీ పెట్టానని గద్ధర్ చెప్పారు. తెలంగాణలో యుద్ధం మొదలైందని ఆయన తెలిపారు.
అంతకుముందు రెండు రోజుల క్రితం గద్దర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తనకు రాహుల్ విధానాలు నచ్చాయన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పక్కా అన్న గద్ధర్.. ఎక్కడి నుంచి పోటీ అనేది త్వరలోనే చెబుతానని స్పష్టం చేశారు. తన కొత్త పార్టీ మేనిఫెస్టో రాసుకోవాల్సి వుందన్నారు. ఉద్యమాలు చేసే పార్టీకి ప్రత్యేక విధానాలు వుంటాయని, ఉద్యమ సారూప్యత వున్న పార్టీలతో కలిసి పనిచేస్తానని గద్ధర్ తెలిపారు.
ALso Read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. పోటీ ఖాయం, ఎక్కడి నుంచి అంటే : గద్ధర్
కాగా.. ఇటీవల భట్టి విక్రమార్కను కలిశారు గద్ధర్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర చరిత్రాత్మకమైనదని కొనియాడారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కారాలను సూచిస్తూ ముందుకు వెళ్లడం అభినందనీయం అని అన్నారు. ఈ పాదయాత్ర తప్పకుండా గణనీయమైన మార్పు తీసుకువస్తుందని ఆశించారు. కాంగ్రెస్ ప్రజల్లో బలమైన మద్దతును ఈ పాదయాత్ర తీసుకువస్తుందని, అదే బలీయమైన ఓటు శక్తిగా పరిణామం చెందుతుందని అభిప్రాయపడ్డారు. తాను ఇటీవలే గద్దర్ ప్రజా పార్టీని నమోదు చేయించానని గద్దర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను ఈ పాదయాత్రను తన పార్టీ తరఫున మద్దతు పలుకుతున్నట్టు వివరించారు.