ఒకే అమ్మాయిని ప్రేమించి... బూడిదగా మిగిలిన ఇద్దరు స్నేహితులు

sivanagaprasad kodati |  
Published : Oct 01, 2018, 07:41 AM IST
ఒకే అమ్మాయిని ప్రేమించి... బూడిదగా మిగిలిన ఇద్దరు స్నేహితులు

సారాంశం

ఎంతటి ప్రాణ స్నేహితులనైనా బద్ధ శత్రువులుగా మార్చే శక్తి అమ్మాయికి ఉందంటారు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ఒకే అమ్మాయిని ప్రేమించి.. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారి.. చివరికి బూడిదగా మారారు. 

ఎంతటి ప్రాణ స్నేహితులనైనా బద్ధ శత్రువులుగా మార్చే శక్తి అమ్మాయికి ఉందంటారు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. తాజాగా ఒకే అమ్మాయిని ప్రేమించి.. ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారి.. చివరికి బూడిదగా మారారు.

జగిత్యాల పట్టణంలోని విజయపురి కాలనీకి చెందిన కూసరి మహేందర్, విద్యానగర్‌కు చెందిన కుందారపు రవితేజ... పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరు ఒకే స్కూల్, ఒకే తరగతి కావడంతో వీరి మధ్య స్నేహం కుదిరింది.. కొద్ది రోజుల్లోనే ప్రాణస్నేహితులుగా మారిపోయారు.

ఈ క్రమంలో రవితేజ, మహేందర్ ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ విషయం ఇద్దరికి తెలియడంతో నువ్వు తప్పుకో అంటే.. నువ్వు తప్పుకో అంటూ తరచూ గొడవకు దిగేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం మహేందర్, రవితేజ మరో స్నేహితుడితో కలిసి పట్టణంలోని మిషన్ కాంపౌండ్‌ మద్యం తాగారు.

మద్యం మత్తులో మరోసారి ప్రేమ విషయంలో గొడవపడ్డారు. అది కాస్తా శృతిమించడంతో ఒకరిపై ఒకరు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. దీంతో భయపడిపోయిన మరో స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు..

అయితే అటుగా వెళుతున్న స్థానికులకు అరుపులు వినిపించడంతో... వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే మహేందర్ చనిపోగా... రవితేజను కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు... అక్కడ చికిత్స పొందుతూ రవితేజ మరణించాడు.

అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్నేహితులిద్దరూ ఒకరిపై ఒకరు పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారా..? లేక తమ అమ్మాయిని వేధిస్తున్నారని ఎవరైనా మూడో వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన స్నేహితుడు మళ్లీ కనిపించలేదు.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu