కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు స్నానం చేయడానికి చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తు నలుగురు చిన్నారులు ఒకరి తర్వాత మరొకరు నీటిలో మునిగిపోయారు.
చెరువులో స్నానానికి అని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన తెలంగాణలోని నారాయణ పేట జిల్లాలో చోటుచేసుకుంది. దామరగిద్ద మండలం మోల్లమాడక గ్రామ పంచాయతీ పరిధిలోని నంధ్యా నాయక్ తండాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నంద్యా నాయక్ తంతడాకు చెందిన ఓ వృద్ధుడు గురువారం మృతి చెందాడు. అతని అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. దీంతో ఆ కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు స్నానం చేయడానికి చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తు నలుగురు చిన్నారులు ఒకరి తర్వాత మరొకరు నీటిలో మునిగిపోయారు. వీరితోపాటు వెళ్లిన ఓ బాలుడు విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశాడు.
స్థానికులు గాలింపు చేపట్టగా అప్పటికే చిన్నారులు మృతి చెందారు. మృతులను అర్జున్(12), అరుణ్(8), గణేశ్(8), ప్రవీణ్(8)గా గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్సై గోవర్థన్ ఘటనాస్థలికి చేరుకొని పోస్టుమార్టం నిర్వహించారు. నలుగురు చిన్నారులు అందులోనూ ఒకే కుటుంబానికి చెందిన వారు అలా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదం రేపింది. కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.