మహబూబ్ నగర్ : బిఆర్ఎస్ తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తరువాత ఇతర పార్టీల్లో గెలుపు గుర్రాల అన్వేషణ ఎక్కువయ్యింది. టికెట్ దక్కని పలువురు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అలాగే ఇప్పటివరకు ఏ పార్టీలోనూచేరని వారూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాలమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి.. మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా ప్రచారం సాకుతోంది. దీంతో గెలుపు గుర్రాల అన్వేషణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మహబూబ్ నగర్ లో కొంత పట్టు దొరికినట్లు అయింది.
టీడీపీ మాజా ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్తకోట దయాకర్ రెడ్డి, ఆయన భార్య సీతా దయాకర్ రెడ్డిలు సుదీర్ఘ కాలం పాటు టిడిపిలో ఉన్నారు. చాలా కాలం నుంచి సీతా దయాకర్ రెడ్డి కూడా భర్తకు తోడుగా రాజకీయాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్లో చేరితే పార్టీ బలోపేతం ఖాయమని ఆ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. సీతా దయాకర్ రెడ్డి 2002లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేశారు.
మెదక్లో సీఎం టూర్: నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభించిన కేసీఆర్
ఆ తరువాత 2009లో దేవరకద్ర నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డిలు ఇద్దరు టిడిపిలోనే ఉన్నారు. ఆ తర్వాత 2022 ఆగస్టులో ఇద్దరూ టిడిపికి రాజీనామా చేశారు. ఆ సమయంలో వారు కంటతడి పెట్టుకున్నారు.
తెలుగుదేశం పార్టీ తమకు కన్నతల్లి లాంటిదని, రాజకీయ సమీకరణాల అనుగుణంగా పార్టీ మార్పు తప్పనిసరిగా భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలో కార్యకర్తలు సూచించిన పార్టీలో చేరతానని అన్నారు. కానీ ఆ తరువాత వారిద్దరూ ఏ పార్టీలోనూ చేరలేదు. రాజీనామా చేసిన సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
టిడిపికి రాజీనామా చేసిన తర్వాత.. ఈ యేడు జూన్ లో కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యం బారిన పడి మృతి చెందారు. ఇప్పుడు ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండడంతో చర్చనీయాంశంగా మారింది.