
తెలంగాణ సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బుధవారం జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ కపట నాటకాలను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగి అరాచకాలను, సీఎం కల్లబొల్లి మాటలను ప్రజలకు వివరించాలన్నారు.
బీఆర్ఎస్ను భూస్థాపితం చేసి.. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని శ్రీనివాస్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాకు రుణపడి వున్నామని.. కాంగ్రెస్ భిక్షతోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల సీజన్ కావడంతో కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని పొంగులేటి ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్ల పాలనా కాలంలో ఏనాడూ ఆర్టీసీని పట్టించుకోని ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఆర్టీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారని ఆరోపించారు. తనకు ఎలాంటి పదవి లేకున్నా ప్రజలకు అండగా వుంటున్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: బీఆర్ఎస్ టిక్కెట్టు నిరాకరణ: తుమ్మలతో నామా భేటీ, బుజ్జగింపులు
కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలోనే టిక్కెట్లు దక్కని పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి చేరుతున్నారు. బీఆర్ఎస్ లో చోటుచేసుకున్న ఈ అసమ్మతిని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది.
బీఆర్ఎస్ కు చెందిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే తనకు టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా, తన కుమారుడికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ను పట్టించుకోని మరో ఎమ్మెల్యే పార్టీ మారేందుకు ప్రతిపక్ష పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే గత నెలలో బీఆర్ఎస్ నుంచి కొంత మంది అసమ్మతివాదులను ఆకర్షించిన కాంగ్రెస్ రెబల్స్ ను ప్రలోభాలకు గురిచేసి కొన్ని సెగ్మెంట్లలో అధికార పార్టీకి గెలుపు అవకాశాలకు అడ్డుకట్ట వేయాలని వ్యూహాలు రచిస్తోంది.
2018లో 88 సీట్లు గెలుచుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్, టీడీపీ, ఇద్దరు ఇండిపెండెంట్ల ఎమ్మెల్యేలను ఆకర్షించడం ద్వారా తన సంఖ్యను 104కు పెంచుకుంది. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కేసీఆర్ నేతృత్వంలోని పార్టీ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. వాస్తవానికి టీఆర్ఎస్ అగ్రనేతల్లో చాలా మంది కాంగ్రెస్ లేదా టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చినవారే. తన రాజకీయ ప్రారంభంలో కేసీఆర్ స్వయంగా టీడీపీతోనే ఉన్నారు. 2001లో పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని స్థాపించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేశారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పార్టీని విస్తరించడానికి కేసీఆర్ గత ఏడాది టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు.