ఎన్నికల వేళ గులాబీ బాస్ పెద్ద స్కెచే వేసారుగా..? 

By Rajesh KarampooriFirst Published Apr 18, 2024, 7:34 PM IST
Highlights

KCR: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మోదీ కూల్చే ప్రయత్నం చేశారన్న కేసీఆర్ అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ కున్న సీట్లు చూస్తే బీజేపీ కొనడం ఎంతసేపు అని వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. అలాగే..  కాంగ్రెస్ నుంచి ఓ కీలక నేత 20 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని చెప్పాడని, కానీ, తాను వద్దని చెప్పినట్లు పేర్కొన్నారు. ఎన్నికల వేళ కేసీఆర్ సంచలన వ్యాఖ్యల వెనుక అంతర్యామిదేనా?  

KCR: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ కూల్చే ప్రయత్నం చేశారనీ, అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ కున్న సీట్లు చూస్తే.. బీజేపీ కొనడం ఎంతసేపు అని వ్యాఖ్యనించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఓ కీలక నేత 20 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతానని చెప్పాడని, కానీ, తాను ఇప్పుడే వద్దని చెప్పినట్లు పేర్కొన్నారు.

 బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిన నేతలు మళ్లీ తనను సంప్రదిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ ఎస్ నేతలకు సీఎం రేవంత్ వ్యవహారశైలి నచ్చడం లేదనీ, అందుకే వారు మళ్లీ తనతో టచ్‌లోకి వచ్చారని  చెప్పుకొచ్చారు. అదేసమయంలో పార్టీని కాదని వెళ్లిన వ్యక్తులు.. మళ్లీ వచ్చి కాళ్లు మొక్కినా తిరిగి పార్టీకి తీసుకోనని తేల్చి చెప్పారు మాజీ సీఎం కేసీఆర్.

పనిలో పనిగా రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తూ.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందనీ, దేశంలో అలాంటి ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో కొనసాగించలేదనీ, 104 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు తన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేశారనీ, కేవలం 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ను బీజేపీ బతకనిస్తోందా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. అదే సమయంలో బీజేపీని టార్గెట్ చేస్తూ..  కాంగ్రెస్‌కు ఉన్న సీట్లు చూస్తే.. బీజేపీ కొనడం ఎంత సేపు అని కొత్త చర్చకు తెర లేపారు కేసీఆర్ .

ఎన్నికల వేళ పార్టీ నేతలకు మోటివేట్ చేస్తూ.. కాంగ్రెస్‌కు అధికారం వచ్చిందని అని బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్తే.. ఇక్కడ అంతా బీజేపీ కథ నడుస్తుందని తనతో ఆ నాయకుడు వాపోయాడని, తాను ఒకే అంటే.. ఇప్పటికిప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీలో చేరుతానని అన్నారనీ, కానీ ఇప్పుడే వద్దని తాను చెప్పానిని బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ చెప్పుకొచ్చారు. 

అదే సమయంలో కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తూ.. కేవలం డబ్బులతో గెలుస్తామంటే కుదరదనీ, జనాల గురించి వారి సమస్యల గురించి పోరాటం చేయాలని అన్నారు. రాబోయే రోజులు ముమ్మాటికి బీఆర్ఎస్‌వే అని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాం అని బీఆర్ఎస్ శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను చూస్తారని అన్నారు. 


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు పై తొలిసారిగా కేసీఆర్ స్పందిస్తూ.. ఆ కేసు అంతా ఉత్తదే అని కొట్టి పారేశారు. 100 రూపాయలు కూడా అవినీతిగా కవిత అకౌంటు ద్వారా ట్రాన్సాక్షన్ చేశారని ఈడీగాని, సీబీఐ అధికారులు గానీ నిరూపించలేరనీ, ఇదంతా కొన్ని రోజుల వరకు త్వరలోనే మళ్లీ టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనీ, ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ను ఆదరిస్తారని అన్నారు. 

అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల వేళ భారీ ప్రణాళికతో ముందుకు వస్తున్నమనీ, సిద్దిపేట, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం,నల్గొండలో భారీ బహిరంగ సభలు ఉంటాయనీ,  రోజువారిగా మూడు రోడ్ షోలు ఉంటాయనీ, సాయంత్రం పూట కార్నర్ మీటింగ్ లో కూడా ఉంటాయని తెలిపారు. నాయకులు అంతా ప్రజలు దగ్గరికి వెళ్ళండనీ, మళ్లీ మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయని మోటివేట్ చేశారు కేసీఆర్.

పార్లమెంట్ ఎన్నికల వేళ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఒకే ప్రెస్ మీట్ లో అటు కాంగ్రెస్ కు.. ఇటు బీజేపీ కి చెక్ పెట్టేశారు. అలాగే.. పార్లమెంట్ ఎన్నికల తరువాత కూడా గులాబీ బాస్ భారీ స్కేచే వేసినట్టు ఉన్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

click me!