టీఆర్ఎస్ vs బీజేపీ : అటు పోస్టర్లు బ్యానర్లు, ఇటు ఎల్ఈడీ స్క్రీన్లు.. మోడీ పర్యటన వేళ ‘పబ్లిసిటీ వార్’

By Siva KodatiFirst Published Jun 29, 2022, 3:33 PM IST
Highlights

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ వస్తుండటంతో రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వివాదం నడుస్తోంది. ముఖ్యంగా ఫ్లెక్సీలు, పోస్టర్లతో ఇరు పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ ఫ్లెక్సీ వివాదం ముదిరింది. కేసీఆర్ కు వ్యతిరేకంగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టిన బీజేపీ .. ‘‘సాలు దొర.. సెలవు దొర’’ అంటూ ప్రచారం మొదలుపెట్టింది. దీనికి కౌంటర్ గా ‘‘ సాలు మోడీ .. సంపకు మోడీ’’, ‘‘బై బై మోడీ’’ పేరుతో ప్రధానిపై ఫ్లెక్సీలు వేసింది టీఆర్ఎస్. పోటాపోటా ఫ్లెక్సీలపై నేతల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. అయితే కంటోన్మెంట్ లో మోడీకి వ్యతిరేకంగా పెట్టిన ఫ్లెక్సీలను తొలగించారు అధికారులు. మరోవైపు కేసీఆర్ కు వ్యతిరేకంగా పెట్టిన ఎల్ ఈడీ  స్క్రీన్లకు ఫైన్ వేసింది జీహెచ్ఎంసీ. 

మరోవైపు.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే కమలనాథులు తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలోనే తాము తెలంగాణ రాష్ట్రానికి ప్రయారిటీ ఇస్తున్నామని తెలియజేసేలా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకున్నారు. జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశాలకు బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అంతేకాకుండా జూలై 3వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభకు ప్రధాని తమోదీ హాజరుకానున్నారు. దీంతో హైదరాబాద్‌లో విస్తృతంగా ప్రచారం సాగించాలని కమలనాథులు భావిస్తున్నారు.

ALso REad:‘‘సాలు మోదీ.. సంపకు మోదీ’’.. హైదరాబాద్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు..

ఇకపోతే.. జూలై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో (parade ground secunderabad) బీజేపీ (bjp) నిర్వహించనున్న సభకు ‘విజయ సంకల్ప సభ’గా నామకరణం చేశారు. హెచ్ఐసీసీ నోవాటెల్ లో ప్రధాని మోడీ (narendra modi) సహా ఇతర ప్రముఖులు బస చేయనున్నారు. జూలై 2న బేగంపేట విమానాశ్రయం నుంచి హెచ్ఐసీసీ నోవాటెల్ కు హెలికాఫ్టర్ లో చేరుకోనున్నారు మోడీ 3వ తేదీన లంచ్ లో తెలంగాణ రుచులను అతిథులకు వడ్డించనున్నారు. నియోజకవర్గాల్లో బస చేసే జాతీయ కార్యవర్గ సభ్యుల షెడ్యూల్ సైతం ఖరారు చేశారు నేతలు. శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జులతో సమావేశమై.. పోలింగ్ బూత్ ల వారీగా పార్టీ పరిస్ధితిపై సమీక్షించనున్నారు. 

అటు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 5 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. మోడీ పర్యటనలో వున్నంత సేపు మూడంచెల భద్రత కల్పించనున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పోలీసులు. బీజేపీ బహిరంగ సభ జరిగే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, హెచ్ఐసీసీ, రాజ్ భవన్ చుట్టూ కేంద్ర బలగాలు పహార కాయనున్నాయి. రాజ్ భవన్ లో ప్రధాని మోడీ బసపై నిర్ణయం తీసుకోనుంది ఎస్పీజీ. రాజ్ భవన్ బసపై పూర్తి స్థాయి నివేదిక ఇచ్చారు సిటీ పోలీసులు. అమిత్ షా, రాజ్ నాథ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లకు ప్రత్యేక భద్రత కల్పించనున్నారు. ఇప్పటికే నోవాటెల్ హోటల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. 

click me!