కరోనా వైరస్: గాంధీలో ప్లాస్మా చికిత్స, తొలి డోనార్ మన వరంగల్ విద్యార్థే....

By Sree sFirst Published May 13, 2020, 9:06 AM IST
Highlights

గాంధీ ఆసుపత్రిలో కూడా ఈ కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీని కరోనా చికిత్సకు చివరి ప్రయత్నంగా ఉపయోగించాడనికి ఐసిఎంఆర్ అనుమతులిచ్చింది. ఇప్పుడు ప్లాస్మా ను ఇవ్వడానికి మన తెలంగాణ నుండి ముందుకొచ్చిన తొలి వ్యక్తి అఖిల్ అనే 24 సంవత్సరాల వరంగల్ విద్యార్ధి. 

కరోనా వైరస్ పోరులో ఇంకా మందు, వాక్సిన్ ఏది లేకపోవడంతో..... వైద్య రంగం ఇంకో మార్గం లేక ప్లాస్మా థెరపీని ఆశ్రయిస్తుంది. దీనిపై ఇంకా పూర్తిస్థాయిలో పరిశోధనలు మాత్రం జరగాల్సి ఉంది. అయితే.... పేషెంట్ పరిస్థితి బాగా దిగజారిపోయి ఉన్నప్పుడు, వేరే మార్గం లేదు అని భావిస్తే... ఈ పద్దతిని ఉపయోగించొచ్చని ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. 

మన గాంధీ ఆసుపత్రిలో కూడా ఈ కాన్వలసెంట్ ప్లాస్మా థెరపీని కరోనా చికిత్సకు చివరి ప్రయత్నంగా ఉపయోగించాడనికి ఐసిఎంఆర్ అనుమతులిచ్చింది. ఇప్పుడు ప్లాస్మా ను ఇవ్వడానికి మన తెలంగాణ నుండి ముందుకొచ్చిన తొలి వ్యక్తి అఖిల్ అనే 24 సంవత్సరాల వరంగల్ విద్యార్ధి.  అతని ప్లాస్మాతో ఇప్పుడు గాంధీ వైద్యులు ఈ ప్లాస్మా చికిత్సను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. 

అతడు బ్రిటన్ ఎడిన్ బర్గ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. లండన్ నుంచి వచ్చిన అతడికి కరోనా వైరస్ సోకడంతో చికిత్స పొందిన 14 రోజుల తరువాత ఈ వైరస్ నుండి కోలుకున్నాడు. ఇప్పుడు అతను ఈ వైరస్ బారినపడ్డ వారికి తన ప్లాస్మాను ఇచ్చి రక్షించడానికి ముందుకువచ్చారు. 

కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నవారిలో ఈ వైరస్ ని ఎదుర్కునే కణాలు మెండుగా ఉంటాయి. ఆ సదరు వ్యక్తి బ్లడ్ ప్లాస్మాను సేకరించి కరోనా వైరస్ తో బాధపడుతున్నవారికి ఎక్కిస్తారు. అప్పుడు ఆ రోగి శరీరంలో ఈ కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు సరిపోను యాంటీబాడీస్ తయారవుతాయనేది పరిశోధకులు చెబుతున్నమాట. 

దీనిపై ఇంకా పూర్తిస్థాయి పరిశోధన జరగాల్సి ఉంది. దీన్ని చికిత్సగా పరిగణించకూడదని చెబుతూనే... ఆఖరి ప్రయత్నంగా, రోగిని బ్రతికించడానికి వేరే ఇంకే ఆప్షన్ లేనప్పుడు మాత్రమే దీన్ని ఆశ్రయించాలని సూచిస్తుంది. 

ఇక ఈ ప్లాస్మా డోనార్ మాత్రం తనకు ఇలా సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇప్పుడు తనవల్ల ఇంకొకరి ప్రాణాలు కాపాడబడుతున్నాయంటే... అంతకన్నా ఆనందం కలిగించే విషయం ఇంకోటి లేదని అంటున్నాడు. 

ఈ కరోనా వైరస్ వచ్చిందని ఎవ్వరు బాధపడకూడదని, ప్రజల్లో ఈ వైరస్ పట్ల మరింత అవగాహనా పెంచాలని అన్నాడు. తాను ఈ వైరస్ బారిన పడ్డప్పుడు వైద్య సిబ్బంది సేవలకు కృతార్థుడను అని చెబుతూనే.... వారు చేస్తున్న సేవకు తీసుకుంటున్న జీతానికి పొంతన లేదని, వారికి 8000 రూపాయలు మాత్రమే ఇవ్వడం తనను కలిచి వేసిందని అన్నాడు. ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించి వారి జీతాలను పెంచాలని కోరాడు. 

click me!