
హైదరాబాద్: గుంటూరులో బ్యూటీషీయన్ సిరి ఆత్మహత్య చేసుకొంది. హైద్రాబాద్లో మరో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ రెండు ఆత్మహత్యల విషయమై రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు విచారణ చేస్తుండగా ఆసక్తికర విషయం వెలుగు చూసింది. వీరిద్దరూ ప్రేమికులని తేలింది. ఈ కేసు విషయమై రెండు రాష్ట్రాల పోలీసులు విచారణ చేస్తున్నారు.
యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టకు చెందిన సిరి బ్యూటీషీయన్గా పనిచేస్తోంది. ఆమె కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. అయితే వీరి వివాహనికి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి గుంటూరులో ఆత్మహత్య చేసుకొందని పోలీసులు తెలిపారు.
అయితే ఆత్మహత్య చేసుకొనే ముందు ఆమె తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడినట్టు ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా తేలింది. దీంతో హైద్రాబాద్లో ఆ ఫోన్ నెంబర్ కు ఫోన్ నెంబర్ గురించి విచారించిన గుంటూరు పోలీసులకు అతను కూడ ఆత్మహత్య చేసుకొన్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు.
అయితే వీరిద్దరూ ప్రేమించుకొన్నారని పెళ్ళికి పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. అయితే వీరిద్దరి ఆత్మహత్యకు ఇతరత్రా కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాను ప్రేమించిన యువతి ఆత్మహత్యను తాను ఆపలేననే ఉద్దేశ్యంతోనే ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.