వివాహేతర సంబంధం : అడ్డుగా ఉన్నాడని.. కొడవలితో భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య..

By AN TeluguFirst Published Aug 24, 2021, 11:59 AM IST
Highlights

ఎనిమిదేళ్ల కిందట పక్షవాతంతో హన్మంతు కాలు, చెయ్యి పడిపోయింది. దంతో పనిచేయకుండా తాగుడికి బానిసై ఇంటిపట్టునే ఉండేవారు. వారి అక్క నాగమ్మ, తన పొలాన్ని సాగు చేయడానికి అదే గ్రామానికి చెందిన ఆగు రేవన్ సిద్ధప్పకు కౌలుకు ఇచ్చారు. 

వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య. ఈ ఘటనకు సంబంధించి తాండూరు డీఎస్పీ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాలు.. ఈ నెల 16న బషీరాబాద్ సమీపంలోని నావంద్గీ అంతరాష్ట్ర సరిహద్దులో గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి దగ్ధం చేసిన కేసును బషీరాబాద్ పోలీసులు చాలెంజింగ్ గా తీసుకుని విచారణ చేపట్టారు. 

పొరుగు రాష్ట్రంలోని సులైపేట్ పోలీసుల సహకారంతో హత్య కేసును చేధించారు. కర్ణాటక రాష్ట్రం సులైపేట్ పరిధిలోని ఎలక్ పల్లి గ్రామానికి చెందిన హన్మంతు, అంబికకు 21 యేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడులున్నారు.

అయితే, ఎనిమిదేళ్ల కిందట పక్షవాతంతో హన్మంతు కాలు, చెయ్యి పడిపోయింది. దంతో పనిచేయకుండా తాగుడికి బానిసై ఇంటిపట్టునే ఉండేవారు. వారి అక్క నాగమ్మ, తన పొలాన్ని సాగు చేయడానికి అదే గ్రామానికి చెందిన ఆగు రేవన్ సిద్ధప్పకు కౌలుకు ఇచ్చారు. 

ఈ క్రమంలో అంబిక, రేవన్ సిద్దప్ప ఇద్దరూ పొలం పనులు చేస్తుండగా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన భర్త హన్మంతు భార్యను, రేవన్ సిద్దప్పను హెచ్చరించినా మార్పు రాలేదు. అయితే, తరచూ తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని ఎలాగైనా అతడిని అంతమొందించాలని భార్య అంబిక పన్నాగం పన్నింది.

ఈ క్రమంలో ఈ నెల 16న సులైపేట్ వెళ్లిన హన్మందును రేవన్ సిద్దప్ప కలిసి మద్యం తాగించాడు. అంబికకు ఫోన్ చేసి నీ భర్త నా దగ్గరే ఉన్నాడు సులైపేట్ కు రావాలని సూచించాడు. ముగ్గురు కలిసి బైక్ పై బషీరాబాద్ కు బయలుదేరారు. హైదరాబాద్ వెల్తున్నామని రైల్వేస్టేషన్ కు వచ్చారు.

అక్కడ మరోసారి మద్యం కొనుగోలు చేసి తాగడానికి నావంద్గీ సమీపంలోని ఓ పొలంలోకి వెళ్లారు. మద్యం తాగుతుండగా రేవన్ సిద్దప్ప రాయితో హన్మంతు తలమీద బాదాడు. కిందపడిపోయిన హన్మంతును భార్య గొంతు నులిమింది. అయినా చనిపోలేదని కొడవలితో గొంతు కోసి హత్య చేశారు. 

శవాన్ని కాగ్నానదిలో పడేయాలని కొంతదూరం మోసుకుని వెళ్లారు. బరువు మోయలేక పొలంలో పెట్రోల్ పోసి నిప్పంటించి తిరిగి వెళ్లిపోయారు. పోలీసులకు పట్టు బడతామని తెలుసుకున్న నిందితులు ఇద్దరూ ఎక్కడికైనా పారిపోదామని సులైపేట్ బస్టాండ్ కు వెళ్లగా పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం తాండూరు కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఇద్దరికీ రిమాండ్ విధించారు. 

click me!