త్రిపుర రాష్ట్ర మాజీ సీఎస్ గా పనిచేసిన వ్యక్తి మోసగాడి బారిన పడ్డారు. నమ్మకంగా వ్యవహరించి సీఎస్ దగ్గరినుంచి రూ.21 లక్షలు కాజేశాడో వ్యక్తి.
హైదరాబాద్ : మోసాలకు పాల్పడే వారు మరీ బరితెగించి పోతున్నారు. ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారిని కూడా మోసగించడానికి వెనకాడటం లేదు. ఈ క్రమంలో త్రిపుర రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీని కూడా మోసగించారు. ఉసురు పాటి వెంకటేశ్వర్లు త్రిపుర రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పని చేసి రిటైరయ్యారు. ఆయన జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్లో నివాసముంటున్నారు. తనను మోసం చేశారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెంకటేశ్వర్లును నానక్ రామ్ గూడలో నివాసముండే కొండ రవిగౌడ్ అనే వ్యక్తి మోసం చేశాడు. రవిగౌడ్ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వెంకటేశ్వర్లు పరిచయమయ్యాడు.
వెంకటేశ్వర్లుతో పరిచయమైన మొదటి రోజు నుంచే రవి గౌడ్ మంచిగా నటించి అతడి నమ్మకాన్ని చూరగొన్నాడు. తనను పూర్తిగా నమ్మాడు అని నిర్ధారించుకున్న తర్వాత వెంకటేశ్వర్ల ను ఒక సహాయం కోరాడు. తన భార్య నగలు తాకట్టులో ఉన్నాయని వాటిని విడిపించుకోవడం కోసం తనకు అర్జంటుగా కొంత నగదు సహాయం కావాలని అడిగాడు. దీనికోసం రూ.21లక్షలు అప్పుగా ఇవ్వాలని వేడుకున్నాడు. అప్పటికే రవిగౌడ్ ను పూర్తిగా నమ్మిన వెంకటేశ్వర్లు ఇది కూడా నిజమే అనుకున్నాడు.
కేరళకు సిట్ అధికారులు.. మరోసారి తుషార్, జగ్గుస్వామిలకు నోటీసులు..
2020 జనవరి 21న పుట్టినరోజు ఫంక్షన్ జరిగిన తర్వాత.. తాకట్టు నుంచి విడిపించిన బంగారాన్ని మళ్లీ కుదువబెట్టి.. వెంకటేశ్వర్లు దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మకంగా చెప్పాడు. అతని మాటలు నమ్మిన వెంకటేశ్వర్లు ఎస్బిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ. 21 లక్షలు అతని అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశాడు. అప్పటినుంచి రవి గౌడ్ ప్రవర్తనలో తేడా వచ్చింది. అతను చెప్పిన గడువు ముగిసి పోయినా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, వ్యక్తిగతంగా కలిసినప్పుడు అడిగిన ఇదిగో అదిగో అంటూ దాటవేస్తూ ఉన్నాడు. కానీ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. దీంతో తాను మోసపోయానని భావించిన వెంకటేశ్వర్లు రవి గౌడ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతనిమీద చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ మేరకు గురువారం జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.