హుజురాబాద్ లో ఈటల విక్టరీ ఎఫెక్ట్: ఇక తెరాసపై మరిన్ని తిరుగుబాట్లు..?

By telugu teamFirst Published Nov 2, 2021, 6:48 PM IST
Highlights

హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామానికి దారి తీసే అవకాశముంది. అధికార పార్టీలో అసంతృప్తులకు ఆయన గెలుపు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపనుంది. టీఆర్ఎస్ అధినాయకత్వానికి సవాల్ చేసి పార్టీ నుంచి బయటకు వచ్చి గెలిచి చూపించవచ్చు అని చెప్పడానికి ఈటల ఒక ఉదాహరణగా నిలిచారు. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో రాజకీయాల్లో గణనీయమైన మార్పులనూ చూడవచ్చని తెలుస్తున్నది. 
 

హైదరాబాద్: హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో Etela Rajender గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో మరో నూతన పరిణామానికి బీజం వేయనుంది. Telangana రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారంలో TRS ఉన్నది. తొలిసారి ఉద్యమ ఊపులో గెలిచిన టీఆర్ఎస్ తిరుగులేని పార్టీగా అభివృద్ధి చెందింది. రెండోసారీ గెలిచి తమకు ఎదురేలేరనే సందేశాన్నిచ్చింది. అటు ప్రతిపక్షాలు బలపడకుండా వ్యూహ ప్రతివ్యూహాలు చేసింది. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధినేత KCR దాదాపు ప్రతీది శాసించే పవర్‌ను కూడగట్టుకున్నారు. ఆయనకు ఎదురుచెప్పడానికి పార్టీలోని సీనియర్ నేతలూ జంకుతున్నారు. ఎదురుచెబితే పార్టీ బయట మనగలగడం కష్టమనే ఆందోళన వారిని అదుపులో పెడుతున్నది. కానీ, Huzurabad Bypollలో ఈటల గెలుపు ఈ పరిస్థితులను భిన్న దారిలో తీసుకెళ్లడానికి దోహదపడే అవకాశమున్నది.

రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నప్పుడు ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్‌పై పలుసార్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాతే, అక్రమ భూముల వ్యవహారం తెర మీదకు వచ్చింది. కేసుల దర్యాప్తుపై హడావుడులు.. మంత్రి ఈటల బర్తరఫ్.. చకచకా జరిగిపోయాయి. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈటల బీజేపీలో చేరి బరిలోకి దిగబోతున్నట్టు ప్రకటించారు. కొంతకాలం ఆయన సొంత పార్టీ పెడతారనే ప్రచారమూ జరిగింది.

Also Read: గెల్లుకు సొంతూర్లోనే కాదు.. అత్తగారి ఊరిలో‌నూ షాక్.. అక్కడ ఈటల ఆధిక్యం ఎంతంటే..?

తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి కేసీఆర్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బయటకు వచ్చి స్వతంత్రంగా లేదా, మరో పార్టీ అభ్యర్థిత్వంపై గెలిచిన దాఖలాలు లేవు. టీఆర్ఎస్ రెబల్స్ ఎవరూ తమ సత్తా చాటిన ఉదంతాలూ లేవు. దుబ్బాక ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఓడిపోయింది. కానీ, దాని నేపథ్యం వేరు. ఈటల రాజేందర్ గెలుపు ఈ కోణంలోనే చూస్తున్నారు. ఆయన గెలుపు టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న Rebel నేతల్లో కొత్త ఊపిరిలూదుతాయనే చర్చ జరుగుతున్నది. కేసీఆర్ ఆధిపత్యానికి గండి పడే అవకాశమూ ఏర్పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈటల రాజేందర్ స్వయంగా కేసీఆర్‌పై ధిక్కార స్వరాన్ని లేవదీసి.. పార్టీలో ఉండే పోరాడారు. బయటకు వచ్చి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పుంజుకుంటున్న బీజేపీలో చేరి అధికార పార్టీకి సవాల్ చేశారు. బీజేపీ టికెట్‌పై బరిలోకి దిగినా ఆయన గెలుపులో తన ఛరిష్మా.. తన ప్రాబల్యం.. తన ఆదరణే కీలక పాత్ర పోషించాయి. అందుకే ఈ ఎన్నికల ప్రచారంలో కమలం గుర్తు కంటే ఈటల రాజేందర్ చిత్రాలనే ఎక్కువగా చూశాం. బీజేపీ పార్టీ నేతలు ప్రచారం చేసినా.. అవి తేలిపోయాయనే పబ్లిక్ టాక్ వినిపించింది. ఈ చర్చల నేపథ్యంలో ఈటల రాజేందర్ బీజేపీ సపోర్ట్ తీసుకున్నప్పటికీ స్వయంగా పోరాడి గెలిచారనేదే మెజార్టీ ప్రజల అభిప్రాయం.

ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులకు ఈటల రాజేందర్ కొత్త దారి చూపెట్టారని అర్థమవుతున్నది. కేసీఆర్ ఎప్పుడూ అజేయుడు కాదనీ, ఆయనపై తిరుగుబాటు చేసీ గెలిచి చూపించవచ్చునని ఉదాహరణగా నిలుస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ప్రచారం చేసినా ఎన్నికలో మెజార్టీతో విజయం సాధించవచ్చని స్పష్టం చేశారు.

Also Read: హుజురాబాద్ ఫలితంపై కేటీఆర్ ఫస్ట్ రియాక్షన్.. ఆయన ఎమన్నారంటే..

ఏ పార్టీలోనైనా అసంతృప్తులు ఉండటం సహజమే. టీఆర్ఎస్ పార్టీలోనూ ఉన్నారు. వర్గాలుగానూ విడిపోయి ఉన్నారు. కొంత కాలం క్రితం హరీశ్ రావుకే ప్రాధాన్యత తగ్గిపోయిందని, కేటీఆర్‌కే కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారనే చర్చ కూడా జరిగింది. హరీశ్ రావే సొంతంగా ఓ పార్టీ పెట్టే అవకాశముందని, లేదా అనుయాయులతో మరో పార్టీలోకి చేరే అవకాశమూ ఉన్నదే చర్చ జరిగింది. ఈటల రాజేందర్ కంటే ముందు కూడా కేసీఆర్‌పై వ్యతిరేక స్వరాలు వినవచ్చినా.. మళ్లీ సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త పరిణామాలకు దారి తీసే అవకాశముందని చర్చ మొదలైంది.

click me!