ఈటల‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్న అధిష్టానం!.. టీ బీజేపీలో మార్పులకు చాన్స్..?

Published : Jun 10, 2023, 11:22 AM IST
ఈటల‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్న అధిష్టానం!.. టీ బీజేపీలో మార్పులకు చాన్స్..?

సారాంశం

తెలంగాణ బీజేపీ నేతల మధ్య వర్గ విబేధాలు ఉన్నాయనే సంగతి ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం కీలకంగా మారింది.

తెలంగాణ బీజేపీ నేతల మధ్య వర్గ విబేధాలు ఉన్నాయనే సంగతి ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం కీలకంగా మారింది. అయితే తెలంగాణ అధికారమే లక్ష్యంగా  పావులు కదుపుతున్న బీజేపీ అగ్రనాయకత్వం.. ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర పార్టీలు కలిసి ముందుకు సాగేలా దిశా నిర్దేశం చేయడంతో పాటు.. కష్టపడి పనిచేసే నేతలకు ముఖ్య బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌కు టీ బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్ర పార్టీలో కూడా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేతల మధ్య సయోధ్య కుదుర్చేలా కూడా ప్రణాళికలు అమలు చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ బాధ్యతలను పార్టీ రాష్ట్ర ఇంచార్జ్‌లకు అప్పగించే అవకాశం ఉంది. 

తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను బండి సంజయ్‌ను తప్పించి.. ఆ పదవి కోసం కిషన్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చినట్లు తెలిసింది. అయితే ఇందుకు ఆయన సుముఖంగా లేరని సమాచారం. కిషన్ రెడ్డి పేరు తర్వాత రాష్ట్ర పార్టీ అద్యక్ష పదవికి డీకే అరుణ పేరు కూడా వినిపిస్తున్నట్టుగా చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఈటల రాజేందర్ ఆశలు పెట్టుకున్నప్పటికీ.. పలు సమీకరణాల  దృష్ట్యా అందుకు పార్టీ అధిష్టానం సుముఖంగా లేనట్టుగా తెలుస్తోంది.  బండి సంజయ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నారనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఇక, ఈ నెల 15న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనకు(ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభ కోసం) వచ్చేలోగానే రాష్ట్ర బీజేపీలో  కొన్ని కీలకమార్పులు చోటుచేసుకోవచ్చని సమాచారం. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత.. తెలంగాణ బీజేపీలో నెలకొన్న వర్గ విబేధాలు తెరపైకి వచ్చాయి. నేతల మధ్య గ్యాప్‌కు సంబంధించి బీజేపీ అధిష్టానం ప్రధానంగా దృష్టి సారించింది. రాష్ట్రంలో కాషాయ పార్టీ పరిస్థితిపై పార్టీ ఇన్‌ఛార్జి సునీల్‌బన్సల్‌, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలతో ఈటల ఇప్పటికే చర్చించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu