ఈ నెల 27 తర్వాత బీజేపీలో చేరికలు.. రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం: ఈటల

By Sumanth KanukulaFirst Published Jul 25, 2022, 2:53 PM IST
Highlights

హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌ ఈటల రాజేందర్ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్‌కు ఓటేసినట్టేనని అన్నారు. 

హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌ ఈటల రాజేందర్ కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్‌కు ఓటేసినట్టేనని అన్నారు. సోమవారం ఆయన జడ్చర్లలో మీడియాతో మాట్లాడారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేయడం ఖాయం అని ఈటల అన్నారు. టీఆర్ఎస్ ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు చెప్పారని అన్నారు. రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తమ పార్టీలోకి ఎవరొచ్చినా గెలిపించుకుంటామని చెప్పారు.  

మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్‌పై విశ్వాసం కోల్పోయారని విమర్శించారు. వారంతా కేసీఆర్‌తో ఇష్టంలేని కాపురం చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉందని.. అందుకే నియోజకవర్గాల్లో పనుల కోసమే వారు టీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారని అన్నారు. అనేక మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ఈ నెల 27 తర్వాత చేరికలు ఉంటాయని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ను ఎదుర్కొని.. రాష్ట్రం సుభిక్షంగా ఉంచాలంటే అది బీజేపీతోనే సాధ్యం అని చెప్పారు. తెలంగాణలో ఎప్పడూ ఎన్నికలు జరిగిన.. కాషాయ జెండా ఎగురుతుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

Latest Videos

click me!