హైదరాబాద్ ఐఐటీకి చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య.. లాడ్జిపై నుంచి దూకి బలవన్మరణం

By Sumanth KanukulaFirst Published Sep 7, 2022, 11:52 AM IST
Highlights

హైదరాబాద్‌ ఐఐటీకి చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లిలో ఓ లాడ్జిపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రాజస్తాన్ జోధ్‌పూర్‌కు చెందిన మేఘ కపూర్‌గా గుర్తించారు.

హైదరాబాద్‌ ఐఐటీకి చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లిలో ఓ లాడ్జిపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రాజస్తాన్ జోధ్‌పూర్‌కు చెందిన మేఘ కపూర్‌గా గుర్తించారు. అతడు ఇటీవలే ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. అయితే కొన్ని వారాలుగా లాడ్జ్‌లోనే ఉన్న మేఘ కపూర్ ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

కపూర్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు సమాచారం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

ఇక, గత నెల 31న ఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అతడిని ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన రాహుల్‌గా గుర్తించారు. రాహుల్ అతని హాస్టల్ గదిలో ఉరేసుకుని కనిపించాడు. రాహుల్  మృతిపై అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక, రాహుల్ బుధవారం తన హాస్టల్ గదిలో మంచానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఐఐటీ యాజమాన్యం సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

‘‘ప్రాథమికంగా ఇది ఆత్మహత్యకు సంబంధించిన కేసు. అయితే, కారణం గురించి మాకు ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. మేము అతని మొబైల్ ఫోన్, కంప్యూటర్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపాం. అందులో ఏదైనా సమాచారం ఉండే అవకాశం ఉంది’’ అని పోలీసులు తెలిపారు. 
 

click me!