
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులు (ఆర్వో), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్వో)ల నియమాకాన్ని ఖరారు చేసింది. జిల్లాల్లోని తాజా పరిస్ధితిని అంచనా వేయడానికి, ఓటర్ల లిస్ట్లోని లోపాలను సరిదిద్దడానికి గాను సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఆర్వో, ఏఆర్వోల జాబితాను తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ విడుదల చేశారు.
ఈ ఉత్తర్వుల మేరకు మెజారిటీ అసెంబ్లీ నియోజవకర్గాలకు ఆర్డీవోలను రిటర్నింగ్ అధికారులుగా నియమించనున్నారు. అలాగే మున్సిపల్ కార్పోరేషన్ కో ఆర్డినేటింగ్ అధికారి బాధ్యతను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జోనల్ కమీషనర్లపకు అప్పగించారు. మరికొన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లకు రిటర్నింగ్ అధికారుల బాధ్యతలు అప్పగించారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తహసీల్దార్లను ఏఆర్వోలుగా నియమించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు మున్సిపల్ అధికారులను ఏఆర్వోలుగా నియమిస్తారు.
కాగా.. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు శుక్రవారం 5 రాష్ట్రాల సీఎస్లు (తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో మూడేళ్లు దాటిన ప్రభుత్వ అధికారులను బదిలీ చేయాలని ఆదేశించింది. కీలక స్థానాల్లో వున్న పోలీస్, రెవెన్యూ అధికారులను బదిలీ చేయాలని సూచించింది. ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లకు వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వొద్దని సీఈసీ ఆదేశించింది.
జూలై 31 లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్ధులతో అధికారులకు బంధుత్వాలు లేవని డిక్లరేషన్ తీసుకోవాలని.. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఉద్యోగులను ఎన్నికల విధులకు దూరంగా వుంచాలని ఈసీ ఆదేశించింది. గతంలో ఈసీ చర్యలు తీసుకున్న వ్యక్తులను కూడా విధులకు దూరంగా వుంచాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.