
జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణికి మద్ధతు ప్రకటించారు. అయితే ఓ వైపు పోలింగ్ జరుగుతుండగా.. వాణికి మద్ధతు ప్రకటించడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసింది.
మరోవైపు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 4 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని ఎన్నికల కమీషన్ తెలిపింది.
Also Read:తెలంగాణలో బీజేపీపై పవన్ ఫైర్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణికి మద్దతు
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టీఆర్ఎస్ తరఫున సురభి వాణీదేవి, బీజేపీ నుంచి రామచందర్రావు, కాంగ్రెస్ తరఫున చిన్నారెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య గట్టి పోటీ నడిచింది. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు 39.09 శాతం పోలింగ్ నమోదైంది.
ఇక నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో టీఆర్ఎస్ తరఫున పల్లా రాజేశ్వర్రెడ్డి, బీజేపీ నుంచి సుగ్గు ప్రేమేందర్రెడ్డి, కాంగ్రెస్ తరఫున రాములు నాయక్, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమరెడ్డి తదితరులు పోటీ పడ్డారు. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు 43.46 శాతం పోలింగ్ నమోదైంది.